ఆకాశ్ ట్యాబ్ మేకర్ను దెబ్బతీసిన మోడీ ఆ 2 కీలక నిర్ణయాలు: హైదరాబాద్ సహా 2 యూనిట్లు క్లోజ్
నోట్ల రద్దు (Demonetisation), జీఎస్టీ ప్రభావం కొత్తగా ప్రారంభమైన బిజినెస్లపై పడింది. జీఎస్టీ టర్నోవర్ను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతకుముందు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో తమ దుకాణాలు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. పలు అంకుర సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం నేపథ్యంలో డేటావిండ్ (DataWind) హైదరాబాద్, అమృత్సర్లోని తమ యూనిట్లను షట్ డౌన్ చేసింది. తక్కువధర కలిగిన ఆండ్రాయిడ్ బేస్డ్ టాబ్లెట్ తయారీ సంస్థ ఆకాశ్.
జీఎస్టీ, నోట్ల రద్దు దెబ్బతీసింది
2016లో చేసిన నోట్ల రద్దు, మరుసటి ఏడాది తీసుకు వచ్చిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) కారణంగా డాటా విండ్ వ్యాపారం దెబ్బతిన్నది. ఈ కారణంగా రెండు యూనిట్లు క్లోజ్ చేసింది. దీంతో పాటు 1,000 ఉద్యోగాలు కోల్పోయారు. డేటా విండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీత్ సింగ్ తులి ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ... ఈ రెండు సవాళ్లు (నోట్ల రద్దు, జీఎస్టీ) తమను దెబ్బతీశాయన్నారు. భారత్ మానవ వనరులు, కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్తో మేకిన్ ఇండియాలో భాగంగా 35 డాలర్ల టాబ్లెట్ను ప్రపంచ మార్కెట్లోకి తీసుకెళ్దామని భావించామని చెప్పారు. మా టార్గెట్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత చాలా ప్రభావం పడిందని, అది ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు.
రూ.250 కోట్ల రుణం
దీంతో హైదరాబాద్, అమృత్సర్ యూనిట్లను షట్ డౌన్ చేసినట్లు, చేస్తున్నట్లు సునీత్ సింగ్ తులి తెలిపారు. అమృత్సర్ ప్లాంట్లో ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, కానీ సామర్థ్యం చాలా తగ్గిపోయిందని తెలిపారు. హైదరాబాదులోని యూనిట్లో 2017లోనే సగం ప్రొడక్షన్ తగ్గిపోయిందని, ఇప్పుడు అది పూర్తిగా నిలిచిపోయిందన్నారు. వెండర్స్ పేమెంట్స్, ఉద్యోగుల వేతనాలు మొత్తం కలిపి తమ రుణం రూ.250 కోట్లకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.250 కోట్ల రుణంతో పాటు ఇండియాలో ఆపరేషన్స్ కోసం కెనడియన్ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందన్నారు. కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటోందన్నారు.
బయటి నుంచి ఉత్పత్తులకు ప్రోత్సాహం
ఓ సమయంలో ఇండియాలో టాబ్లెట్ మార్కెట్లో దూసుకెళ్లిన డేటా విండ్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయిందని, దీనికి నోట్ల రద్దు, జీఎస్టీ క్లాబ్స్ కారణమని సునీత్ సింగ్ తులి అభిప్రాయపడ్డారు. గూడ్స్ను స్థానికంగా తయారు చేయించే బదులు, తయారయిన వాటిని రప్పిస్తున్నారని, ఇక్కడ తయారయ్యే వాటికి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని వాపోయారు. ప్రధానంగా క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) పైన కొనసాగే బిజినెస్లు నోట్ల రద్దు వల్ల కొనుగోలు శక్తి తగ్గడంతో దెబ్బతిన్నాయని, జీఎస్టీ స్పాయిల్ చేసేదిగా మారిందన్నారు. 7 అంగుళాల టాబ్లెట్ పైన 18 శాతం, 6 అంగుళాల స్మార్ట్ ఫోన్ పైన 12 శాతం జీఎస్టీ, ఇది వినియోగదారులపై ప్రభావం చూపిందని అన్నారు.