NSEకి సెబి భారీ షాక్: కో-లొకేషన్ కేసులో సంచలన తీర్పు, రూ.625 కోట్లు చెల్లించండి
దేశంలోని అతిపెద్ద స్టాక్ ట్రేడింగ్ ప్లాట్ ఫారం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)పై కేపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి (సెబి) కొరడా ఝులిపించింది. కో-లొకేషన్ ట్రేడింగ్ వ్యవహారంలో ఆర్జించిన రూ.625 కోట్లకు పైగా లాభాన్ని తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోలుగా బాధ్యతలు నిర్వహించిన రావి నారాయణ్, చిత్ర రామకృష్ణన్లపై వేటు వేసింది. లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్కు సంబంధించిన మరే ఇతర సంస్థతోను సంబంధం లేకుండా అయిదేళ్లపాటు వీరిపై నిషేధం విధించింది. ఎన్ఎస్ఈలో పని చేసిన నిర్దేశిత కాలానికి అందుకున్న జీతంలో నుంచి 25 శాతం సెబికి చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి 104 పేజీల ఆర్డర్ కాపీనీ విడుదల చేసింది.
SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా?: ఈ రోజు నుంచి ఈ రూల్స్ మారుతున్నా
ఎన్ఎస్ఈపై ఉక్కుపాదం
సమాచార దుర్వినియోగం కేసులో ఎన్ఎస్ఈపై సెబీ ఈ ఉక్కుపాదం మోపింది. డేటా అక్రమ వినియోగం ద్వారా రూ.625 కోట్లు, దానికి 12 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఇది రూ.1000 కోట్ల వరకు కానుంది. ఆరు నెలల పాటు కొత్త డెరివేట్ ఉత్పత్తులు ప్రవేశపెట్టవద్దని చెప్పింది. హైఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ద్వారా కొన్ని సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరిందని తేల్చింది. సెక్యూరిటీల మార్కెట్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లావాదేవీలు జరపకుండా ఆరు నెలల పాటు ఎన్ఎస్ఈపై నిషేధం విధించింది. ఎన్ఎస్ఈ తరఫున షేర్లు, బాండ్లు కొనకుండా నిషేధం ఉంటుంది.
మాజీలపై వేటు
ఎన్ఎస్ఈకి డైరెక్టర్, సీఈవోలుగా రవి నారాయణ్, చిత్రా రామకృష్ణన్లు వ్యవహరించారు. వీరిపై కూడా సెబి కఠిన చర్యలు తీసుకుంది. వీరు ఏ లిస్టెట్ కంపెనీ లేదా మౌలిక వసతుల సంస్థ లేదా మార్కెట్ ఇంటర్మీడియరీతో అనుబంధం లేకుండా అయిదేళ్ల నిషేదం విధించింది. ఇద్దరూ ఏ స్టాక్ ఎక్స్చేంజ్, క్లియరింగ్ కార్పోరేషన్లో మూడేళ్ల పాటు ఏ బాధ్యతలు చేపట్టవద్దని ఆదేశించింది.
అసలేం జరిగింది?
2010లో ఎన్ఎస్ఈ మెంబర్షిప్ కలిగిన సంస్థలకు కో-లొకేషన్ సేవల్ని స్టార్ట్ చేసింది. దీని ప్రకారం ఎక్స్చేంజ్ ప్రాంగణంలో సంస్థలు తమ సర్వర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు కొంత ఫీజు వసూలు చేశారు. దీంతో అత్యంత వేగవంతమైన డేటాతో ఏదైనా సమాచారాన్ని వెంటవెంటనే పొందే అవకాశం ఉంటుంది. దీంతో వీరు సెకనుకు వేల సంఖ్యలో కొనుగోలు లేదా అమ్మకం ఆర్డర్లను అప్పటికప్పుడే మిగతా వారి కంటే ముందుగా నిర్వహించే వీలు ఉంది. ఈ సదుపాయం ద్వారా కొందరు ఉన్నతాధికారులు లబ్ధి పొందడంతో పాటు ఎక్స్చేంజ్కి మంచి లాభాలు వచ్చాయని, కో-లొకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2015లో సెబికి ఫిర్యాదు అందింది. దీంతో విచారణ జరిపింది.