ధోనీకి ఎంత డబ్బు చెల్లించారో రేపటిలోగా చెప్పండి: ఆమ్రపాలికి సుప్రీం కోర్టు
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమ్రపాలి గ్రూప్ పైన కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తనకు రావాల్సిన రూ.40 కోట్లు బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. బకాయిలు చెల్లించకుండా ఆ కంపెనీ మోసం చేసిందని పేర్కొన్నాడు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
ఆమ్రపాలి నుంచి రూ.40 కోట్లు రావాలని కోర్టుకెక్కిన ధోనీ, ఏం జరిగిందంటే?
ధోనీకి ఇప్పటివరకు ఎంత చెల్లించారో చెప్పాలని ఆమ్రపాలి సంస్థను సుప్రీం మంగళవారం ఆదేశించింది. ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారం లోగా కోర్టుకు అందించాలని చెప్పింది.
2009-2016 మధ్యకాలంలో ధోనీ.. ఆమ్రపాలి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. తన సేవలను వాడుకుని తనకు రావాల్సిన మొత్తం డబ్బులు చెల్లించలేదని ధోనీ పిటిషన్ వేశాడు. అసలు, వడ్డీ కలిపి తనకు మరో రూ.40 కోట్లు రావాలని పేర్కొన్నాడు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో తాను ఓ పెంట్ హౌస్ను బుక్ చేసుకుంటే, దాని యాజమాన్య హక్కులు కూడా కల్పించకుండా మోసం చేసిందని పేర్కొన్నాడు.
మరోవైపు, కొనుగోలుదారులను మోసం చేసిన కేసులో ఆమ్రపాలి గ్రూప్ పైన సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తమ నుంచి డబ్బులు తీసుకొని ఇల్లు కట్టివ్వకుండా సంస్థ తమను మోసం చేసిందని 46వేల మంది కోర్టుకు ఎక్కారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు ఆమ్రపాలి డైరెక్టర్లు, బోర్డు సభ్యుల ఆస్తులను జఫ్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, మధ్యలో ఆపేసిన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ)ను సుప్రీం జనవరి 25వ తేదీన ఆదేశించింది. ఆమ్రపాలి సీఎండీ, ఇద్దరు డైరెక్టర్లను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ఫిబ్రవరి 28వ తేదీన ఆదేశించింది.