అమ్మకానికి ఊబెర్ షేర్లు...ఐపీఓ ద్వారా 10 బిలియన్ డాలర్లు సేకరించాలని టార్గెట్
వాషింగ్టన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ రవాణా సంస్థ ఊబెర్ ఐపీఓల విలువను 80.5 బిలియన్ డాలర్ల నుంచి 91.5 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. భారత కరెన్సీలో దీని విలువ రూ. 5,60,300 కోట్లు నుంచి రూ. 6,30,337 కోట్లుగా ఉంది. ఇక ఒక్కో షేరును 44 డాలర్ల నుంచి 50 డాలర్లను ఊబెర్ విక్రయించనున్నట్లు సమాచారం. మొత్తంగా 180 మిలియన్ షేర్లు అమ్మకానికి పెట్టింది ఊబెర్ సంస్థ. దీని ద్వారా 9 బిలియన్ డాలర్లను రాబట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆ సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు 27 మిలియన్ షేర్లను అమ్మకానికి పెట్టారు.అవి 1.35 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయాయి.
ఆ సంస్థలో ఉన్న పెట్టుబడిదారులు ఇప్పటికే తమ షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తం, తాజాగా 180 మిలియన్ షేర్లను అమ్మి వచ్చే డబ్బును కలిపితే 10 బిలియన్ డాలర్లు వస్తాయని కంపెనీ పేర్కొంది. అమెరికాలో చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్ విక్రయించిన షేర్ల తర్వాత దానికంటె పెద్ద మొత్తంలో షేర్లు విక్రయించిన కంపెనీగా ఊబెర్ సంస్థ ఆవిర్భవించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ సంస్థ 2014లో పెద్ద మొత్తంలో తన కంపెనీ షేర్లను బహిరంగంగా విక్రయించింది.
ఇక తమ కంపెనీ షేర్లను విక్రయిస్తున్నట్లు తెలిపేందుకు న్యూయార్క్లో ఓ రోడ్ షో నిర్వహించింది ఊబెర్ సంస్థ. ఇక సోమవారం రోజున లండన్లో పెట్టుబడిదారుల సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత అమెరికాకు తిరిగొచ్చి షేర్ల విక్రయాల గురించి చెబుతారు. ఇక మే 9న తమ కంపెనీ షేర్లను విక్రయించాలని ఊబెర్ సంస్థ భావిస్తోంది. ఆ తర్వాత న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ నిర్వహించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఊబెర్ సంస్థలో పెట్టుబడులు పెట్టి తమ షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తంలో 6.86 మిలియన్ షేర్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకులు ట్రావిస్ కాలానిక్, మరియు గారెట్ క్యాంప్లదే కావడం విశేషం.