ఆర్బీఐ విడుదల చేయనున్న కొత్త 20 రూపాయల కరెన్సీ నోటు ఇలా ఉంటుంది
ముంబై: త్వరలో కొత్త రూ.20 నోటును విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ సిరీస్లో ఈ నోటు విడుదల కానుంది. ఈ నోటుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉండనుంది. ఇక ఈ కొత్త నోటు ఆకుపచ్చ పుసుపు పచ్చ మిశ్రమంతో కూడిన రంగులో ఉంటుంది. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహలు ఉంటాయి. అవి దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకున్న రూ.20 నోట్లు అన్ని చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక నోటుపై ఇతర డిజైన్లు కూడా ఉండనున్నాయి. కొత్తగా రానున్న రూ.20 కరెన్సీ నోటు వెడల్పు 63 మిల్లీ మీటర్లు ఉంటుండగా... పొడవు 129 మిల్లీమీటర్లు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. నోటుకు ముందు భాగంలో సున్నా సంఖ్యలు ఉంటాయి. ఇక దేవనగిరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది.
మహాత్మాగాంధీ ఫోటో నోటు మధ్యలో ఉంటుంది. సూక్ష్మ స్థాయిలో ఆర్బీఐ అని రాసి ఉంటాయి. అంతేకాదు భారత్, ఇండియా, 20 అని రాసి ఉంటాయి. ఇక నోటుపై వాగ్దాన నిబంధనతో కూడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. గాంధీ ఫోటోకు కుడివైపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తు ఉంటుంది. అంతేకాదు అశోకుడి స్తంభం చిహ్నం, 20 వాటర్ మార్క్ ఉన్నాయి. ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా రూ.10 నోటు, రూ. 50 నోటు, రూ.100 నోటు, రూ.200 నోటు ఇప్పటికే విడుదల చేసింది.