మారుతి సుజుకి మరో షాక్: పెరిగిన బాలెనో మోడల్స్ ధర
బాలెనో కార్ల ధరలను పెంచుతూ మారుతి సుజుకీ నిర్ణయం తీసుకుంది. బాలెనో డీజిల్ కార్ల ధరలను ఆయా కార్ల ధరలను బట్టి రూ.12,000 నుంచి 20,000 వరకు పెంచింది. బాలెనో ఆర్ఎస్ ధర రూ.13,000 పెరిగింది. ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. రూ. 6.61 లక్షల నుంచి రూ.8.60 లక్షల మధ్య లభించే బాలెనో డీజిల్ మోడల్స్ రూ.6.73 లక్షల నుంచి రూ.8.73 లక్షలకు పెరిగాయి.
1 లీటర్ బూస్టర్ జెట్ పెట్రోలు ఇంజిన్తో లభ్యమయ్యే బాలెనో ఆర్ఎస్ మోడల్ ధర తాజా పెంపు అనంతరం రూ.8.88 లక్షలకు చేరుకుంది. ఇదివరకు దీని ధర రూ.8.76 లక్షలుగా ఉంది. ధరల పెంపుకు కంపెనీ కారణాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.
అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ పెట్టుబడులను నూతన కార్లను తయారు చేయడానికి, పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు, సేల్స్పాయింట్స్ను పెంచేందుకు వినియోగిస్తామని కంపెనీ ప్రకటించింది. గత ఏడాది సంస్థ రూ.4 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.
డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయబోతున్న మారుతి
కాగా, వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ నుంచి డీజిల్ కార్ల విక్రయాలను నిలిపేస్తున్నట్లు మారుతీ సుజకీ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్ 6 ప్రమాణాలు అమలులోకి రానున్న నేపథ్యంలో వీటి తయారీ నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. చిన్న తరహా డీజిల్ ఇంజిన్లను బీఎస్ 6 ఇంజిన్లుగా మార్చాలంటే అధిక వ్యయం అవుతుందని, దీంతో కార్ల ధరలు బాగా పెరుగుతాయని, అందుకే నిలిపేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఒకవేళ బీఎస్ 6 డీజిల్ కార్లకు డిమాండ్ ఉంటే 1500 సీసీ ఇంజిన్ మోడళ్లనే అభివృద్ధి చేస్తామని, అంతకంటే తక్కువ సామర్థ్యం కలిగిన మోడళ్లను మాత్రం చేయమని స్పష్టం చేశారు. బీఎస్ 6 నిబంధనల ప్రభావంతో డీజిల్ మోడల్ కార్లను నిలిపేయనున్నట్లు మొట్టమొదట ప్రకటించిన కంపెనీ మారుతి సుజుకీనే. దేశీయంగా డీజిల్ కార్ల మార్కెట్లో మారుతీ వాటా 23 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 4.63 లక్షల డీజిల్ కార్లను విక్రయించింది.