జియో హవా, బీఎస్ఎన్ఎల్కు పెరిగిన కస్టమర్లు: వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్
రిలయన్స్ జియో, ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఫిబ్రవరి నెలలో సత్తా చాటాయి. మిగిలిన టెలికం రంగ సంస్థల కంటే ఇవి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరి చివరినాటికి దేశంలో టెలికం వినియోగదారుల సంఖ్య 120.50 కోట్లకు చేరుకుందని ట్రాయ్ గురువారం తెలిపింది. క్రితం ఫిబ్రవరి నెలలో కొత్తగా వినియోగదారులను ఆకర్షించిన వాటిలో రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ టాప్లో నిలిచాయి. జియో, బిఎస్ఎన్ఎల్లు 86.39 లక్షల మంది వినియోగదారులను పొందాయి. ఇదే ఫిబ్రవరి నెలలో ఇతర టెలికం ఆపరేటర్లు 69.93 లక్షల మందిని కోల్పోయారు.
సిగరేట్, లిక్కర్ కంపెనీలా: ప్రభుత్వంపై వొడాఫోన్ ఐడియా సీఈవో
జియో, బీఎస్ఎన్ఎల్ హవా
ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల మంది వినియోగదారులను జోడించింది. దీంతో తక్కువ సమయంలో ఏకంగా 30 కోట్ల సబ్స్క్రైబర్లు కలిగిన రికార్డ్ సొంతం చేసుకుంది. బీఎస్ఎన్ఎల్ 9 లక్షల మందిని జోడించింది. దీంతో బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య 11.62 కోట్లకు చేరుకుంది. ఇక, ఫిక్స్డ్ లైన్ కనెక్షన్స్ సంఖ్య దేశంలో క్రమంగా తగ్గుతోంది. ఫిబ్రవరిలో బీఎస్ఎన్ఎల్ లక్షమందిని కోల్పోగా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు వరుసగా 42,456, 17,563 ఫిక్స్డ్ లైన్ కస్టమర్లను పొందారు.
కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా
ఇక, అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన జాబితాలో వొడాఫోన్ ఐడియా ఉన్నట్లు తేలింది. ఇది ఏకంగా 57.87 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరి నాటికి వొడాఫోన్ - ఐడియా వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. టాటా టెలీ సర్వీసెస్ 11.47 లక్షల మంది మొబైల్ కస్టమర్లను కోల్పోగా, ఎయిర్టెల్ 49,896 మందిని కోల్పోయింది.
జియో మినహా బీఎస్ఎన్ఎల్ మాత్రమే
రిలయన్స్ జియో మినహా బీఎస్ఎన్ఎల్ మాత్రమే అదనపు ఖాతాదారులను పొందిందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. తమ సంస్థ పట్ల వినియోగదారులకు ఉన్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుందని చెప్పారు. తమ 3జీ నెట్వర్క్ను మరింత మెరుగుపర్చుకోవడం, అధికారులు, ఉద్యోగుల సంయుక్త సహకారంతో మరింత రాణిస్తామన్నారు. మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగిందని తెలిపారు.