మోడీ మాట నమ్మాలా, బ్యాంకులది నమ్మాలా: విజయ్ మాల్యా సూటి ప్రశ్న
లండన్: బ్యాంకులకు వేలకోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశాడు. బ్యాంకులను నమ్మాలా, ప్రధానిని నమ్మాలా అని ప్రశ్నించాడు. మోడీ ప్రభుత్వం వచ్చాక మాల్యా, నీరవ్ మోడీ వంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు చట్టం తీసుకువచ్చారు. దీంతో మాల్యా దిగివచ్చి తన అప్పులు చెల్లిస్తానని చెబుతున్నాడు. లండన్లో ఉంటున్న అతను అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాను చెల్లించే అప్పుల విషయంలో ప్రధాని మోడీ అబద్ధాలు చెబుతున్నారా లేక బ్యాంకులు చెబుతున్నాయా తనకు అర్థం కావడం లేదని మాల్యా అన్నాడు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని స్వయంగా భారత ప్రధాని మోడీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పారని, కానీ కొన్ని బ్యాంకులు బ్రిటన్ కోర్టుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చెబుతున్నాయని, ఎవరిని నమ్మాలని ప్రశ్నించాడు. మోడీ లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలని ట్వీట్ చేశాడు.
ఏ జైల్లో ఉన్నా 100 శాతం చెల్లిస్తా, నా పోటీదారు ఐనా: జెట్ ఎయిర్వేస్పై మాల్యా సానుభూతి
పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016లో భారత్ విడిచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లండన్లో ఉంటున్నాడు. అతడిని భారత్కు అప్పగించే విషయమై లండన్ కోర్టులో విచారణ సాగుతోంది.
మరోవైపు, రుణాలు చెల్లించే విషయంలో సెటిల్మెంట్కు రావాలని విజయ్ మాల్యా బ్యాంకులను కోరాడు. ఇందుకు బ్యాంకులు ఒప్పుకోకపోవడంతో విమర్శలు చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి పట్ల కఠిన చట్టం తీసుకు రావడంతో ఆయన మెట్టు దిగాడు. దీంతో పారిపోయిన అతని పట్ల చట్టపరంగా ముందుకు వెళ్తున్నారు.