5 విమానాలే నడుపుతున్న జెట్ ఎయిర్వేస్, ఆయిల్ మార్కెట్స్ ఆపేస్తే అంతే!
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ తాత్కాలికంగా మూతబడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. అయితే జెట్కు బ్యాంకుల నుంచి నిధులు అందే అవకాశముందని కూడా చెబుతున్నారు. సంస్థను దివాలా స్మృతికి చేర్చే పరిస్థితి లేదని అంటున్నారు. జెట్ను గట్టెక్కించేందుకు వేల కోట్లు అవసరం. ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ.400 కోట్లు అవసరమని చెబుతున్నారు.
జెట్ డైరెక్టర్ల బోర్డు సమావేశమై.. అత్యవసరంగా రూ.400 కోట్లు అందకుంటే కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. బ్యాంకర్లతో మరో విడత చర్చించేందుకు సీఈఓ వినయ్ దూబేకు అధికారం ఇచ్చింది. జెట్ పునరుద్ధరణ ప్రణాళికకు బ్యాంకర్లు కట్టుబడి ఉన్నారని, అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని పీఎన్బీ ఎండీ తెలిపారు.
సోమవారం నుంచీ బ్యాంకర్లు, జెట్ మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఏదీ తేలలేదు. జెట్ పునరుద్ధరణ ప్రణాళిక కింద అత్యవసరంగా రూ.1500 కోట్లు సమకూరుస్తామని, గత నెలలో బ్యాంకులు అంగీకరించాయి. మంగళవారం ఎస్బీఐ నేతృత్వంలోని 26 బ్యాంకుల కన్సార్టియం భేటీ అయింది. పలు అంశాలపై చర్చించారు.
ఏ జైల్లో ఉన్నా 100 శాతం చెల్లిస్తా, నా పోటీదారు ఐనా: జెట్ ఎయిర్వేస్పై మాల్యా సానుభూతి
తాజాగా, బుధవారం (ఏప్రిల్ 17) జెట్ ఎయిర్వేస్ కేవలం 5 విమానాలను మాత్రమే రన్ చేస్తోంది. ఆయిల్ కంపెనీలు ఫ్యూయల్ ఆపేసేవరకు ఇవి నడుస్తాయని చెబుతున్నారు. బ్యాంకుల నుంచి నిధులు రాకుంటే మాత్రం కంపెనీలు ఆయిల్ ఆపేస్తాయని, అప్పుడు మరిన్ని విమానాలు నిలిచిపోతాయని అంటున్నారు.
కాగా, జెట్లో వాటా కొనుగోలు కోసం ఆసక్తి చూపించి, బిడ్ వేసిన నరేష్ గోయల్ దానిని ఉపసంహరించుకున్నారు. 75 శాతం వరకు వాటా విక్రయానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకర్ల తరఫున ఎస్బీఐ క్యాపిటల్ బిడ్లను ఆహ్వానించింది. గోయల్ బిడ్ ఉంటే ఉపసంహరించుకుంటామని ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ కేపిటల్ అల్టిమేటం జారీ చేసింది. దీంతో గోయల్ దానిని వెనక్కి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, జెట్ సమస్యల వల్ల సర్వీసుల రద్దు, విమాన ఛార్జీలు పెరగడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు పౌర విమానయాన మంత్రి సురేశ్ ప్రభు మంగళవారం తెలిపారు. ప్రయాణికుల భద్రత, వారి హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాను ఆదేశించారు.