క్వార్టర్ 4 ఎఫెక్ట్: దూసుకెళ్లిన టీసీఎస్, డీలాపడిన ఇన్ఫోసిస్
టీసీఎస్, ఇన్ఫోసిస్ గతవారం ఒకేరోజు క్వార్టర్ 4 ఫలితాలను ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు అంచనాలను మించి రాణించాయి. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ ఇన్ఫోసిస్ అంచనా కంటే తక్కువగా ఆదాయ అంచనాలను ప్రకటించింది. దీంతో ఈ ప్రభావం కంపెనీ కంపెనీ షేర్లపై పడింది. సోమవారం నాటి ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో సాగాయి. టీసీఎస్ షేర్లు మాత్రం లాభాల్లో కనిపించాయి.
క్వార్టర్ 4లో మంచి లాభాలు వచ్చినందున సోమవారం నాడు టీసీఎస్ షేర్లు 3 శాతం పెరిగాయి. ట్రేడింగ్ ఆరంభంలో బీఎస్ఈలో షేరు ధర దాదాపు 3 శాతం లాభపడి రూ.2,085 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం మూడు గంటలకు 2076 వద్ద కొనసాగింది. సాయంత్రం గం.3.50 నిమిషాలకు 2,113 వద్ద ట్రేడ్ అయింది. గత వారం కంటే 4.89 శాతం లాభపడింది.
మరోవైపు, ఇన్ఫోసిస్ షేర్లు భారీగా నష్టపోయాయి. 4.56 శాతం నష్టంతో రూ.713.70 వద్ద ప్రారంభమైన షేర్ ఆ తర్వాత మరింత దిగజారింది. ఓ సమయంలో ఐదు శాతం నష్టంతో ట్రేడ్ అయింది. ఆ తర్వాత కోలుకున్నా నష్టాల్లో కొనసాగింది. సాయంత్రం గం.3.45 నిమిషాలకు కాస్త కోలుకొని 728.20 వద్ద ట్రేడ్ అయింది. అయినా 2.61 శాతం నష్టంతో ముగిసింది.