జెట్ ఎయిర్వేస్కు రేపు రూ.1000 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్! ఇప్పటికే మరిన్ని సర్వీసుల నిలిపివేత
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్కు సోమవారం రూ.1,000 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రానుందని తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు అత్యవసరంగా ఈ మొత్తం ఇవ్వాలని యోచిస్తోందని తెలుస్తోంది. ఈ మొత్తం ఇచ్చేందుకు బ్యాంకుల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. కానీ ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం.
మే 7వ తేదీ వరకు జెట్ ఎయిర్వేస్ ఓ కార్యాచరణ ఇస్తే ఈ మొత్తాన్ని ఇవ్వనున్నారని తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ ఆర్థిక సంక్షోభంలో పడినందున వేలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున.. పీఎంవో జోక్యం చేసుకుంది. దీంతో ఏప్రిల్ 15వ తేదీలోగా ప్లాన్ ఇవ్వాలని ఎయిర్ లైన్స్ మేనేజ్మెంట్ను బ్యాంకుల కన్సార్టియం కోరింది. ఈ ప్లాన్ ఇస్తే సోమవారం రూ.1000 కోట్లు ఎమర్జెన్సీ ఫండ్గా ఇచ్చే అవకాశముంది.
జెట్ ఎయిర్వేస్లో కొత్త ట్విస్ట్: నరేష్ గోయల్ బిడ్
మరోవైపు, ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్ మరిన్ని కీలక అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపేసింది. వీటిల్లో ఈస్ట్ ఆసియా దేశాలు ఉన్నట్లుదా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను సోమవారం వరకు రద్దు చేసింది.
తాజాగా సార్క్, ఏసియన్ దేశాలకు వెళ్లే సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్ను నిలిపేసినట్లు ఏవియేషన్ రెగ్యులేటరీకి సమాచారం అందించింది. వీటిలో కొలంబో, ఖాట్మాండ్, సింగపూర్, హాంగ్కాంగ్లు ఉన్నాయి. వీటి ముందస్తు బుకింగ్స్ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో మాత్రం ఇంకా చెప్పలేదు. వేసవి సీజన్ కావడంతో జెట్ ఎయిర్వేస్ లండన్ సర్వీసులను ఏప్రిల్ 15 నుంచి పునరుద్ధరించాలని భావిస్తోంది. దీంతోపాటు యూరప్లోని ప్యారిస్, ఆమ్స్టర్డామ్లకు మళ్లీ విమానాలను నడిపే అవకాశముంది.