75శాతం జెట్ ఎయిర్వేస్ వాటాల విక్రయానికి సిద్ధం: రూ.1000 కోట్ల ఆస్తి.. షరతులివే
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్లో వాటాలను విక్రయించాలని రుణదాతలు నిర్ణయించారు. 75 శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు బిడ్లు దాఖలు చేసేందుకు వ్యూహాత్మక వాటాదారులకు కనీసం రూ.1000 కోట్ల ఆస్తులు (144 మిలియన్ డాలర్లు) ఉండటంతో పాటు మూడేళ్ల పాటు విమానయానరంగంలో అనుభవం ఉండాలని పేర్కొన్నారు.
గుడ్ న్యూస్: రిటైరింగ్ ప్రైవేటు ఉద్యోగులకు ఊరట, పెరగనున్న పెన్షన్
ఇందుకు సంబంధించి బిడ్లను ఏప్రిల్ 10వ తేదీలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించింది.
జెట్ ఎయిర్వేస్ ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. జనవరిలో 124 విమానాలకు గాను ఇప్పుడు ఆ విమానాలు 26కు పడిపోయాయి. దాదాపు పదకొండేళ్లుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు పతాకస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో నరేష్ గోయల్ తప్పుకున్నారు. గోయల్ కుటుంబం వాటా 51 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. ఒకప్పుడు ఎయిరిండియాను దాటి దేశంలో నెంబర్ వన్గా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది.
జెట్ ఎయిర్వేస్ రుణ పరిష్కారానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం 180 రోజుల గడువు విధించుకుంది. రుణ పరిష్కారానికి ఆర్బీఐ జారీ చేసిన సమయ నిర్దేశిత ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలోను, అవే ఆదేశాల ప్రకారం బ్యాంకులు గడువు విధించుకున్నాయి.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ను గాడిలో పెట్టే వరకు తాము ఎదురుచూడలేమని, బ్యాంకులు ఆర్థిక శాఖకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు వ్యూహాత్మక వాటాదారులను తీసుకురావడంలో విఫలం కావడం లేదా ప్రక్రియ పూర్తికాకపోయినా జెట్ పైన దివాలా పరిష్కార ప్రక్రియను రుణదాతలు కోరే అవకాశముందని సమాచారం. బిడ్డింగ్ ప్రక్రియకు సరైన స్పందన లభించకుంటే బ్యాంకులు ఎన్సీఎల్టీని ఆశ్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.