చైనీస్ ఈ కామర్స్ కంపెనీలకు చెక్, పన్నులు ఎగ్గొట్టే సంస్థలకు ఝలక్
భారత్లో చైనా వస్తువులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. తక్కువ ధరకే వస్తుండటంతో చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్ చేసి వస్తువులు తెప్పించుకుంటున్నారు. ఇలా నిత్యం లక్షకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తున్న చైనా ఈ కామర్స్ కంపెనీలు యదేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గిఫ్ట్ల పేరుతో ఆర్డర్లు డెలివరీ చేస్తూ కస్టమ్ డ్యూటీ ఎగ్గొడుతున్నాయి. దీనిపై ఎట్టకేలకూ స్పందించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. చైనా ఈ కామర్స్ సైట్లపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది.
ప్రేమ కోసం లక్షల కోట్లు వదులుకున్న అమెజాన్ సీఈవో మాజీ భార్య
40శాతం తక్కువ ధరలు
చైనాలో ఉత్పత్తయ్యే వస్తువుల ధరలు భారత్తో పోలిస్తే 40శాతం తక్కువగా ఉంటాయి. నాణ్యత విషయంలో తేడా ఉన్నా జనం తక్కువ రేటుకే వస్తుండటంతో వాటిని కొనేందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, పవర్ బ్యాంకుల్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో పాటు దుస్తులు, ఇతర వస్తువులు తెప్పించుకుంటున్నారు. ఇలా చైనా ఈ కామర్స్ కంపెనీలు నిత్యం లక్షా 20 వేల ఆర్డర్లు పొందుతున్నాయి.
కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ ఎగవేత
నిత్యం లక్షకు పైగా ఆర్డర్లు పొందుతున్న చైనా కంపెనీలు ఆయా వస్తువులను గిఫ్ట్ల పేరుతో పార్సిల్ చేసి భారత్ పంపుతున్నారు. పార్సిళ్లపై గిఫ్ట్ అని ముద్రించి కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ ఎగ్గొడుతున్నాయి. వాస్తవానికి 5వేల రూపాయలలోపు వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ చైనా ఈ కామర్స్ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి.
ఆలస్యంగా మేల్కొన్న అధికారులు
కొన్నేళ్లుగా చైనీస్ ఈ కామర్స్ సంస్థలు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఎట్టకేలకూ అధికారులు ఈ దిశగా దృష్టి సారించారు. చైనా పార్సిళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కస్టమ్స్ డిపార్ట్మెంట్తో పాటు పోస్టాఫీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్పోర్టులు నౌకాశ్రయాలకు వచ్చే పార్సిళ్లపై మాత్రమే కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ విధిస్తుండగా.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ అమలు చేయాలని డీపీఐఐటీ స్పష్టం చేసింది.
పార్సిళ్ల తనిఖీ
విదేశాల నుంచి వస్తున్న వస్తువులన్నీ గిఫ్టులైనా లేక ఆన్లైన్ పార్సిల్లా తెలుసుకునేందుకు వాటిని తనిఖీ చేయాలని డీపీఐఐటీ అన్ని పోర్టుల అధికారులకు లేఖ రాసింది. ముఖ్యంగా చెన్నై, కోల్కతా రేపులకు వచ్చే పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించింది.
తగ్గిన పార్శిళ్లు
చైనాకు చెందిన క్లబ్ ఫ్యాక్టరీ, అలీ ఎక్స్ ప్రెస్, షీన్ వంటి ఈ కామర్స్ కంపెనీలు ఈ తరహా నిబంధనల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు డీపీఐఐటీ గుర్తించింది. నిబంధనలు కఠినతరం చేయడంతో గతంలో రోజూ రెండులక్షల వరకు వచ్చే పార్సిళ్లు ఇప్పుడు లక్షా 20 వేలకు తగ్గిపోయాయని అధికారులు అంటున్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
చైనా ఈ కామర్స్ కంపెనీలు పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఆయా సంస్థలు ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. ఇలాచేయడం ద్వారా స్థానిక చట్టాల ప్రకారం ఆ కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.