పేటిఎం తన సామ్రాజ్యాన్ని మెల్లిమెల్లిగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం రీఛార్జులకు మాత్రమే పరిమితమైన సంస్థ ఇప్పుడు గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆఫర్ చేస్తోంది. తాజాగా షేర్ ట్రేడింగ్లోకి కూడా అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. పేటిఎంకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ పేటిఎం మనీ ఈ విషయాన్ని ధృవీకరించింది.
షేర్ ట్రేడింగ్కు సంబంధించిన తమకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి అన్ని అనుమతులూ లభించినట్టు పేటిఎం తన బ్లాగ్లో వెల్లడించింది. వీటితో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి బ్రోకర్ మెంబర్షిప్ కూడా పొందినట్టు తెలిపింది.

ఎప్పుడు మొదలు?
ఇప్పటికే వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్లో భాగంగా ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేసుకున్న పేటిఎం మనీ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ప్రోడక్టుల కోసం సన్నద్ధమవుతోంది. తమ పేటిఎం మనీ ద్వారా ఈక్విటీస్, క్యాష్ సెగ్మెంట్, డెరివేటివ్స్, ఈటీఎఫ్స్ సహా ఇతర ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ప్రోడక్ట్స్ను ఆఫర్ చేస్తామని తెలిపింది. అయితే ఎప్పుడు ఈ సేవలను ప్రారంభిస్తారు అనే అంశంపై మాత్రం పేటిఎం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
''తాజా అనుమతులతో వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో మేం పూర్తి స్థాయి సేవలను అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. లక్షలాది మంది భారతీయులకు సంపద సృష్టించే అవకాశం కల్పించడమే మా లక్ష్యం. అత్యంత పారదర్శకంగా, సులువైన పద్ధతుల్లో మంచి పెట్టుబడి అనుభూతిని కల్పించేందుకు మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి'' అంటూ పేటిఎం తన బ్లాగులో వివరించింది.
రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్, ప్రోడక్ట్ డిజైన్పై దృష్టి సారించబోతోంది పేటిఎం మనీ. లక్షలాది మంది భారతీయులకు సేవలను అందించే లక్ష్యంతో ప్రత్యేకంగా ట్రేడింగ్ మార్కెట్ ఆపరేషన్స్, సెటిల్మెంట్, డిపాజిటరీస్, రిస్క్, ఫైనాన్స్, ట్రెజరీ సహా వివిధ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేయబోతోంది.
నెంబర్ ఒన్ టార్గెట్
ప్రస్తుతం బ్రోకింగ్ బిజినెస్లో నెంబర్ ఒన్ ర్యాంక్తో దూసుకుపోతున్న జెరోధా(Zerodha)తో పోటీపడేందుకు పేటిఎం సిద్ధమవుతోంది.
పేటిఎం మనీ దగ్గర ప్రస్తుతం 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సెప్టెంబర్ 2018లో మొదలైన ఈ డివిజన్ ఇప్పటికే 25 అసెట్ మేనేజ్మెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. గత నెలలో మాతృ సంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ నుంచి రూ.28.87 కోట్లను సమీకరించింది పేటిఎం మనీ. వీటితో పాటు వివిధ సేవలను అందించేందుకు పేటిఎం రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications