ఎయిర్ పోర్ట్స్ బిజినెస్లోకి టాటా గ్రూప్: జీఎంఆర్లో 20 శాతం వాటా కొనుగోలు
టాటా గ్రూప్ విమానాశ్రయాల వ్యాపారంలోకి ప్రవేశించింది. జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)లో దాదాపు 45 శాతం వాటాను టాటా గ్రూప్తోపాటు సింగపూర్కు చెందిన సార్వభౌమ సంపద నిధి జీఐసీ, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్ దక్కించుకుంటున్నాయి. ఈ మేర కు ఒప్పందం కుదిరినట్లు బుధవారం జీఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ డీల్ నేపథ్యంలో జీఏఎల్ విలువను రూ.17,700 కోట్లకు పైగా లెక్కగట్టారు. టాటా గ్రూప్, సింగపూర్ సంస్థలకు రూ.8 వేల కోట్ల విలువైన 45 శాతం వాటా దక్కుతుంది. దీంతో జీఏఎల్లో జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల వాటా దాదాపు 54 శాతానికి పరిమితం కానుంది.
ఇందులో టాటా గ్రూప్కు దాదాపు 20 శాతం (రూ.3,650 కోట్లు), జీఐసీకి 15 శాతం, ఎస్ఎస్జీకి 10 శాతం వరకు వాటాలు రానున్నాయి. ఉద్యోగ సంక్షేమ సంఘానికి మరో 2 శాతం వాటా ఉండనుంది. జీఎంఆర్ గ్రూప్కు రూ.20,000 కోట్ల రుణ భారం ఉంది. ఈ డీల్తో వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చనుంది. రెండు నెలల్లో ఈ డీల్ పూర్తి కానుందని చెబుతున్నారు. మొత్తం రుణ భారంలో డిసెంబర్తో ముగిసిన త్రైమాసికం నాటికి జీఐఎల్కు రూ.6,500 కోట్లు, జీఏఎల్కు రూ.2,000 కోట్లుగా ఉంది. రుణభారం తగ్గడం వల్ల సంస్థ ఏకీకృత ఆర్థిక వ్యయం కూడా రూ.1,000 కోట్ల వరకు తగ్గుతుందని జీఎంఆర్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఆమ్రపాలి నుంచి రూ.40 కోట్లు రావాలని కోర్టుకెక్కిన ధోనీ
ఈ పెట్టుబడితో విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణ వ్యాపారంలోకి టాటా గ్రూప్ అడుగుపెట్టినట్లవుతుంది. దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు వెచ్చించటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో వచ్చే దశాబ్దకాలం పాటు విమానాశ్రయాల విభాగంలో పెద్దఎత్తున వ్యాపార అవకాశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఈ అంశాన్ని టాటా గ్రూప్ పరిగణనలోకి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
ఈ రంగంలోకి వచ్చేందుకు టాటా గ్రూప్ గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను టాటాలకు అప్పగిస్తే బాగుంటుందనే ప్రచారం కూడా సాగింది. ఎయిర్ ఏషియా, విస్తారాలో టాటా గ్రూప్కు పెట్టుబడులు ఉన్నాయి. కానీ విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణ విభాగంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు జీఎంఆర్లో పెట్టుబడులు పెడుతోంది.
జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ సేవలు దేశ, విదేశాల్లో ఉన్నాయి. న్యూఢిల్లీతో పాటు హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. ఫిలిప్పీన్స్, గ్రీస్, టర్కీల్లోని ఎయిర్ పోర్టులను కూడా జిఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఏపీలో ప్రతిపాదిత భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని దక్కించుకుంది.