రాజీనామా ఎఫెక్ట్: దూసుకెళ్లిన జెట్, 68.87 వద్ద క్లోజ్ అయిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నాటి నష్టాల నుంచి బయటపడ్డాయి. మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 424 పాయింట్లు లాభపడి 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 11,483 వద్ద స్థిరపడ్డాయి. స్థిరాస్తి రంగ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకెళ్లాయి. నిఫ్టీ ఐటీ రంగ సూచీ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయింది. ముఖ్యంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లే నష్టపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 68.86 వద్ద ముగిసింది. అంతకుముందు రోజు 68.94 వద్ద ముగిసింది.
ఈ యాప్ను వాడుతున్నారా, జాగ్రత్త: హెచ్డీఎఫ్సి వార్నింగ్
జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితలు తప్పుకోవడంతో సోమవారం నుంచి ఈ కంపెనీ షేర్లు జోరుమీద ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ షేర్లు మంగళవారం నాటి ట్రేడింగ్లో దాదాపు 7 శాతం పెరిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు పెట్టుబడులు పెట్టనుండటంతో షేర్లు పెరిగాయి. తాజాగా రూ.1500 కోట్ల నిధులు సమకూరడంతో స్టాక్ దూసుకెళ్లింది. జెట్ ఎయిర్వేస్ స్టాక్ మంగళవారం రూ.271 దగ్గర క్లోజైంది.
జెట్ ఎయిర్వేస్, వేలాదిమంది ఉద్యోగుల కుటుంబాల ప్రయోజనాలతో పోలిస్తే ఏ త్యాగం పెద్దది కాదని, సంస్థ మేలు, ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం తాను జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి వైదొలగుతున్నానని, ఈ నిర్ణయం విషయంలో తన కుటుంబం తనతోనే ఉందని, తనకు మద్దతుగా నిలబడిందని, ఉద్యోగులందరికీ తాను ఒక్కటే చెబుతున్నానని, ఇది ముగింపు కాదని, మన బ్రాండ్కు సరికొత్త అధ్యాయం మొదలవుతోందని, స్థిరంగా సాగుతుందని రాజీనామా చేసిన నరేష్ గోయల్ పేర్కొన్నారు. ఆయన బోర్డు నుంచి తప్పుకున్నాక కంపెనీ షేర్లు జోరు మీద ఉన్నాయి.
కాగా, రాజీనామా నేపథ్యంలో ప్రమోటరైన నరేష్ గోయల్ వాటా 51 శాతం నుంచి 25 శాతానికి పరిమితమవుతుంది. ఎతిహాద్ వాటా వాటా కూడా 24 శాతం నుంచి 12 శాతానికి పరిమితమవుతుంది. నరేశ్ గోయల్ భవిష్యత్లో తన వాటాను 25 శాతం కంటే ఎక్కువకు పెంచుకోడానికి కన్సార్షియం అవకాశం కల్పించింది. ఇక, ఎస్బీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియంకు 51 శాతం సొంతం కానుంది. తక్షణం రూ.1500 కోట్ల నిధులను ఇవ్వడానికి బ్యాంకుల కన్సార్టియం అంగీకరించింది.
జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేయడానికి మే చివరకల్లా ఇన్వెస్టర్లు రావొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. మే 31 కల్లా బిడ్డింగ్ ప్రారంభం కావొచ్చునని, జెట్ను కొనుగోలు చేయాలనుకునే వారందరికీ ఇది ఒక అవకాశమని, ఏప్రిల్ 9 కల్లా ఆసక్తి వ్యక్తీకరణ చేసి ఏప్రిల్ 30 కల్లా బైండింగ్ బిడ్ దాఖలు అవుతుందని ఎస్బీఐ ఛైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు.