నా డబ్బు తీసుకొని జెట్ ఎయిర్వేస్ను కాపాడండి, నన్ను వదిలేశారు: విజయ్ మాల్యా ఆఫర్
లండన్: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీ బోర్డు నుంచి జెట్ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితలను తప్పుకోవాలని చెప్పారు. అలాగే ఆయనకు ఉన్న 51 శాతాన్ని తగ్గించుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం వీరిద్దరు బోర్డు నుంచి తప్పుకోవడంతో, జెట్ సంక్షోభం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పుడు దీనిని గట్టెక్కించేందుకు రుణదాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
గోయల్, అనితా రాజీనామా: దూసుకెళ్లిన జెటి ఎయిర్వేస్ షేర్లు
|
సంతోషమే కానీ కింగ్ ఫిషర్ను ఆదుకుంటే బాగుండేది
అయితే జెట్ ఎయిర్వేస్పై రుణదాతలు (బ్యాంకర్లు) చూపిన శ్రద్ధపై కింగ్ ఫిషర్ యజమాని విజయ్ మాల్యా ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులది రెండు నాల్కల ధోరణి అని విమర్శించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. జెట్ ఎయిర్వేస్ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయడానికి, వేలాది మంది ఉద్యోగులను కాపాడేందుకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు చేసిన ప్రయత్నాలు సంతోషాన్ని కలిగించాయని, కానీ కింగ్ ఫిషర్ను కూడా ఇలాగే ఆదుకుంటే బాగుండేదని ఆయన ట్వీట్ చేశారు.
|
ఎన్డీయే ప్రభుత్వంలో ఏం మార్పు వచ్చిందో తెలియదు
కింగ్ ఫిషర్ కంపెనీని కాపాడాలని నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు తాను రాసిన లేఖలపై బీజేపీ అధికార ప్రతినిధులు ఆరోపణలు చేశారని, యూపీఏ హయాంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్కు తప్పుగా మద్దతిస్తున్నాయని ఆరోపించారని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను లేఖలు రాసినందుకు మీడియా తనకు వ్యతిరేకంగా కథనాలు రాసిందని, కానీ ఎన్డీయే ప్రభుత్వంలో ఏం మార్పు ఉందో అర్థం కావడం లేదని, ఇది తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.
|
నిర్దాక్షిణ్యంగా వదిలేశారు
కింగ్ ఫిషర్ కంపెనీని, సిబ్బందిని కాపాడేందుకు తాను రూ.4వేల కోట్ల పెట్టుబడులు పెట్టానని మాల్యా పేర్కొన్నారు. వాటిని గుర్తించకుండా తనపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని వాపోయారు. ఉత్తమ ఉద్యోగులు, మంచి సేవలు అందిస్తూ అత్యుత్తమ కంపెనీగా ఉన్న కింగ్ ఫిషర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదే ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా వదిలేశాయని విమర్శించారు. ఇది వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
|
జెట్ ఎయిర్వేస్ కోసం మాల్యా ఆఫర్
అంతేకాదు, జెట్ ఎయిర్వేస్ కోసం తన డబ్బులు తీసుకోవాలని కూడా బ్యాంకులకు మాల్యా ఆఫర్ ఇచ్చారు. తాను మరోసారి చెబుతున్నానని, బ్యాంకులు, రుణదాతలతో రాజీ కోసం కర్ణాటక హైకోర్టు ముందు తన ఆస్తులను ఉంచానని, బ్యాంకులు తన డబ్బును ఎందుకు తీసుకోవడం లేదని, జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఆ డబ్బులు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంతకుమించి మరో ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డారు.