వయస్సు 37.. కంపెనీ విలువ రూ.37 వేల కోట్లు: బైజూస్ సూపర్ సక్సెస్ స్టోరీ
ఓ చిన్న ఆలోచన.. అత్యద్భుత వ్యాపారంగా మారుతుందని మొదట్లో ఊహించడం కష్టం. అందుకే చిన్నదే కదా అని దేన్నీ అంత ఈజీగా తీసిపారేయలేం. ట్యూషన్స్ చెప్పడంతో మొదలైన వ్యాపారం ప్రస్థానం ఇప్పుడు విద్యారంగంలోనే ఓ పెను విప్లవానికి తెరదీసింది. మూస పద్ధతుల్లో చెప్పే విద్యకు పుల్ స్టాప్ పెట్టి టెక్నాలజీని జత చేయడం ఇప్పుడదో యూనికార్న్ కంపెనీ అయింది. అదే బైజూస్. దీని వెనుక ఉన్న వ్యక్తే 37 ఏళ్ల రవీంద్రన్.
బైజూస్.. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇప్పుడిదో విప్లవం. రొటీన్ రొడ్డకొట్టుడు చదువులకు భిన్నంగా టెక్నాలజీని ఉపయోగించి అత్యంత సులువుగా పిల్లలకు అర్థమయ్యేలా వీడియోల రూపంలో చదువు చెప్పడం బైజూజ్ స్పెషాలిటీ. ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ ఎగ్జామ్కు కోచింగ్ ఇచ్చేందుకు ఆఫ్ లైన్ క్లాసులను 2007లో మొదలుపెట్టారు రవీంద్రన్. ఐఐఎంలో చదివిన అనుభవంలో ఈ రంగానికి టెక్నాలజీని జోడించారు. 2009లో థింక్ అండ్ లెర్న్ అనే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో ట్యాబ్లెట్స్ బేస్డ్ ఫార్మాట్కు శ్రీకారం చుట్టారు.
రూ.360 కోట్ల పెట్టుబడికి రూ.3000 కోట్ల లాభం!
తమ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు ట్యాబ్లెట్స్ ఇచ్చి అందులో ప్రోగ్రామింగ్ చేసి కంటెంట్ను ఇవ్వడం, దాన్ని వాళ్లు చదువుతున్నారా లేదా ఎవాల్యుయేట్ చేయడం వంటివి చేశారు. అయితే ఈ ట్యాబ్ ఫార్మాట్ అప్పట్లో అంత గొప్పగా సక్సెస్ కాలేదు. కాన్సెప్ట్ బాగుంది.. ట్యాబ్స్ ఆలోచన వర్కవుట్ కాకపోవడంతో ఆయన తక్షణం ప్లాన్ మార్చుకున్నారు. వెంటనే యాప్ థీమ్ను డిజైన్ చేశారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తగ్గలేదు బైజూస్.
ఏంటీ బైజూస్ యాప్
నాలుగో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ స్కూలు విద్యార్థులకు అవసరమైన కంటెంట్ను యాప్ ద్వారా బోధిస్తారు. వీటితో పాటు ఐఐటి, జెఈఈ, నీట్, క్యాట్, జీమ్యాట్, జీఆర్ఈ కోచింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఎక్కువగా సైన్స్, మ్యాథ్య్ సబ్జెక్ట్ను విజువల్స్ ద్వారా సులువుగా అర్థమయ్యేలా వివరించడం వీళ్ల స్పెషాలిటీ. డిజిటల్ యానిమేషన్స్, షార్ట్ వీడియోస్ వంటివి అధికంగా ఉంటాయి. ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే స్పందించేందుకు టీచర్స్ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటారు. దీనికి సబ్స్క్రిప్షన్కు డబ్బులు వసూలు చేస్తారు. ప్రస్తుతం వీళ్ల దగ్గర 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్లలో 9 లక్షల మంది పెయిడ్ మెంబర్స్ ఉన్నారు. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.1400 కోట్ల ఆదాయాన్ని సాధిస్తామని గతంలో రవీంద్రన్ వెల్లడించారు. ఈ లెక్కన సంస్థ భారీ ఆదాయన్నే మూటగట్టుకుంటోంది.
ఏడాదిలో 4 రెట్లు పెరిగిన విలువ
గత మార్చిలో ఈ సంస్థ విలువ రూ.7000 కోట్లుగా ఉండేది. అయితే డిసెంబర్ నాటికే ఇది రూ.20 వేల కోట్లకు చేరింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రముఖ సంస్థలన్నీ బైజూస్లో పెట్టుబడికి క్యూ కట్టాయి. వాళ్లలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఫౌండేషన్, చైనీస్ ఇంటర్నెట్ జెయింట్ టెన్సెంట్ వంట వాళ్లు ఉన్నాయి. వీటికితోడు నాస్పర్స్ వెంచర్స్ వంటి ప్రముఖ సంస్థలూ పెట్టుబడులు కుమ్మరించాయి.
తాజాగా జెనరల్ అట్లాంటిక్ సంస్థ 25 మిలియన్ డాలర్లను బైజూస్లో ఇన్వెస్ట్ చేసింది. తాజా పెట్టుబడి లెక్కలప్రకారం బైజూస్ విలువ 5.4 బిలయ్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.37వేల కోట్లు. ఇది దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీగా కూడా గుర్తింపు పొందింది.
రవీంద్రన్ పంటపండింది
సాధారణంగా ఇలాంటి సంస్థల్లో ప్రమోటర్లు మొదట్లోనే ఆత్రపడి తమ తమ వాటాలను అమ్మేసుకుంటూ ఉంటారు. ఓలా, ఫ్లిప్ కార్ట్, పేటిఎం డీల్స్లో ఇదే జరిగింది. అయితే రవీంద్రన్ అతని ఫ్యామిలీకి ఇప్పటికీ సంస్థలో 36 శాతం వాటా ఉంది. లేటెస్ట్ వేల్యుయేషన్ నేపధ్యంలో దీని విలువ రూ.13267 కోట్లు. వాటాలు ఉన్న ఫ్యామిలీ సభ్యుల్లో రవీంద్రన్ భార్య దివ్యా గోకుల్నాథ్, తమ్ముడు రా ఉన్నారు. వీళ్లంతా ఈ దెబ్బతో న్యూఏజ్ యంగ్ జనరేషన్ కోటీశ్వరులైపోయారు.