గూగుల్కు రూ.11వేల కోట్లకు పైగా భారీ జరిమానా, ఎందుకంటే?
బ్రస్సెల్స్: సెర్చింజన్ గూగుల్ పైన యూరోపియన్ యూనియన్ (ఈయూ) రెగ్యులేటర్లు భారీ జరిమానా విధించారు. దాదాపు 1.50 బిలియన్ యూరోల (దాదాపు11,623 కోట్లు) పెనాల్టీని విధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ సంస్థకు ప్రకటనల రూపంలో మేలు చేసినందుకు గాను యూరోపియన్ యూనియన్ కాంపిటీషన్ కమిషన్ ఈ జరిమానాను విధించింది.
ఆన్లైన్ ప్రకటనల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకే ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. గూగుల్ తన విధుల్ని మరిచిపోయిందని పేర్కొంది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ బుధవారం ఆదేశాలు జారీచేశారు.
ఈ మేరకు మార్గారెట్ వెస్టాగర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రకటనల్లో గూగుల్ గుత్తాధిపత్యం ఆరోపణల నేపథ్యంలో.. సుదీర్ఘ విచారణ తర్వాతే ఈ జరిమానా విధించినట్లు చెప్పారు. గూగుల్ తన అధికారాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని, దాని వల్ల కొన్ని కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని, వినియోగదారులు మోసపోతున్నారన్నారు. గత రెండేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో పెనాల్టీ విధించడం ఇది మూడవసారి అన్నారు.
ఆసియాలో వరస్ట్ నుంచి బెస్ట్ కరెన్సీ: రూపాయి బలపడటానికి కారణమేమిటి?
గూగుల్పై ఇలా జరిమానాల వేయడం మూడోసారి. బ్రోకర్ల ద్వారా వెబ్సైట్లను అడ్డుకుంటూ గూగుల్ ప్రకటనల ప్రపంచాన్ని ఏలాలని ప్రయత్నాలు చేసిందన్నారు. గూగుల్, దాని మాతృ సంస్థ అల్భాబెట్.. ఈయూ యాంట్రీ ట్రస్ట్ నియమాలను ఉల్లంఘించాలని పేర్కొన్నారు.
గూగుల్ తమ యాడ్ సెన్స్ వేదికను దుర్వినియోగం చేస్తూ ఇతర పోటీ సంస్థలకు అవకాశం లేకుండా కుట్రతో వ్యవహరించిందన్నారు. దీనివల్ల వినియోగదారులపై భారం పడుతోందని, ఇతర సంస్థల ప్రకటనల వ్యయం పెరుగుతోందని, కొన్ని సంస్థలకే లాభాలు వచ్చేలా గూగుల్ ప్రవర్తించిందన్నారు. కాగా, మైక్రోసాఫ్ట్ ఫిర్యాదు నేపథ్యంలో 2016లో విచారణ ప్రారంభించిన ఈయూ.. తాజాగా ఈ జరిమానా విధించింది. గతంలోనూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కేసులో 5 బిలియన్ డాలర్లు, మరో కేసులో 3 బిలియన్ డాలర్ల మేర జరిమానాల్ని గూగుల్పై ఈయూ విధించింది.