జెట్ ఎయిర్వేస్ సంక్షోభం: చేతులెత్తేసిన ఎతిహాద్, ఎస్బీఐకి ఆఫర్: విమానాల భద్రతపై ఆందోళన
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సంక్షోభం కొనసాగుతోంది. ఓ వైపు కంపెనీలోని తమ 24 శాతం వాటాని ఎస్బీఐకి ఇస్తామని ఎతిహాద్ చేతులెత్తేయగా, మరోవైపు ఉద్యోగులు జీతాలులేక ఇబ్బందులు పడుతున్నారు. తమకు వేతనాలు ఇవ్వకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి సేవలు నిలిపేస్తామని పైలట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిధులు సమకూర్చి జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఇది మూతబడితే 16వేల మంది ఉద్యోగాలకు ఎసరు వస్తుంది.
జెట్ ఎయిర్వేస్ కష్టాలపై ఎమర్జెన్సీ మీటింగ్: సేవ్ చేయాలని బ్యాంకులకు కేంద్రం
తమ వాటాను రూ.400కు అమ్మివేస్తామని ఎతిహాద్
జెట్ ఎయిర్వేస్ నుంచి బయటకు వెళ్లాలని భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నిర్ణయం తీసుకోవడం మరింత కలకలం రేపుతోంది. రుణ భారం, నగదు లభ్యత సమస్యలతో సతమతమవుతూ, సత్వరం రూ.750 కోట్లు సమకూర్చకపోతే మరిన్ని కష్టాలు తప్పవని ఎతిహాద్కు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ ఇటీవల లేఖ రాశారు. రుణ పరిష్కార ప్రణాళికను వివరించారు. అందుకు ఎతిహాద్ అంగీకరించలేదు. అంతేకాదు, తమకు ఉన్న 24 శాతం వాటాను రూ.400 కోట్లకే అమ్మివేస్తామని, కొనుగోలు చేసుకోవాలని ఎస్బీఐని ఎతిహాద్ కోరింది.
రుణ భారమే అధికం
జెట్ ఎయిర్వేస్కు పాతికేళ్ల చరిత్ర ఉంది. జెట్ ఎయిర్వేస్ షేర్ విలువ రూ.229 వరకు ఉంది. కానీ తాము రూ.150కే అమ్మేస్తామని ఎతిహాద్ చెప్పింది. ఈ లెక్కన దీని మార్కెట్ విలువ దాదాపు రూ.1800 కోట్లు ఉంటుంది. కానీ రుణభారం మాత్రం రూ.8200 కోట్ల వరకు ఉంది. అంటే జెట్ ఎయిర్వేస్ను అమ్మేసినా రుణభారం దాదాపు ఐదో వంతు తీరుతుంది. ఈ సంస్థ మూతపడితే 16,000 మంది ఉద్యోగాలకు కష్టాలు తప్పవు. దేశీయ విమానయాన రంగ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.
గట్టెక్కాలంటే ఏం చేయాలి
ఎతిహాద్ వంటి సంస్థ తప్పుకుంటే జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ మరింత కష్టమవుతుందని భావిస్తున్నారు. ఎస్బీఐ దీనిని కొనుగోలు చేసినా అందులో అనుభవం లేదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే మరో భాగస్వామిని వెతకాలి. ఇందుకోసం జెట్ ఎయిర్వైస్ చైర్మన్ నరేష్ గోయల్, ఆయన తనయుడు నివాన్ గోయల్ ఇటీవల దోహా వెళ్లి ఖతార్ ఎయిర్వేస్ గ్లోబల్ సీఈవో అక్బర్ ఆల్ బకర్ను కలిసినట్లుగా చెబుతున్నారు. జెట్ ఎయిర్వేస్ను గండం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. ఆదుకోవాలని బ్యాంకులను కోరింది. రుణాలను ఈక్విటీగా మార్చుకొని వాటా తీసుకోవాలని ప్రభుత్వం కూడా సూచిస్తోంది. జెట్ ఎయిర్వేస్ వాటాదార్లు తమ షేర్లను పూచీకత్తుగా తనఖా పెడితే బ్యాంకులు మరిన్ని రుణాలు సమకూర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సంస్థ అధిక సంఖ్యలో విమానాలు నిలిపివేయడం, సర్వీసులు రద్దు చేయడంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని తన సెక్రటరీని మంత్రి సురేష్ ప్రభు మంగళవారం కోరిన విషయం తెలిసిందే. ముందస్తు బుకింగ్, రిఫండ్, భద్రత అంశాలపై డీజీసీఏ నుంచి పూర్తి నివేదిక కావాలన్నారు. ఇప్పటికే 119 విమానాలకు గాను 41 విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు తగ్గుతాయని భావిస్తున్నారు.
మానసిక ఒత్తిడిలో ఉద్యోగులు, విమానాల భద్రతపై ఆందోళన
తమకు నెలల తరబడి జీతాల్లేవని, పనిపై దృష్టి పెట్టలేకపోతున్నామని పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)కు జెట్ ఎయిర్వేస్ విమానాల నిర్వహణ ఇంజినీర్ల సంక్షేమ సంఘం (జేఏఎంఈడబ్ల్యూఏ) మంగళవారం తెలిపింది. నెలాఖరు వరకు వేతన బకాయిలను చెల్లించకుంటే సంస్థపై తమకు నమ్మకమే పోతుందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, జీతాలను ఇప్పించాలని కోరింది. 119 విమానాలున్న జెట్ ఎయిర్వేస్లో వాటి నిర్వహణకు దాదాపు 560 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 490మంది ఇంజినీర్లకి జేఏఎంఈడబ్ల్యూఏ ప్రాతినిథ్యం వహిస్తోంది. తమకు మూడు నెలల జీతాలు రావాలని తెలిపింది. తమ ఉద్యోగాలు మానసిక ఒత్తిడిలో ఉన్నారని జెట్ ఎయిర్వేస్ కూడా తెలిపింది. ఈ క్రమంలో విమానాల భద్రత ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ మరో కింగ్ ఫిషర్ అవుతుందా అనే చర్చ సాగుతోంది.