కుప్పకూలిన జెట్ ఎయిర్వేస్ షేర్లు, అంధకారంలో 23వేల మంది ఉద్యోగుల భవితవ్యం
ముంబై: సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ షేర్లు కుప్పకూలాయి. ఇది ఇటీవలి వరకు రెండో అతిపెద్ద విమానయాన సంస్థ. ఇఫ్పుడు ఈ సంస్థ మూడో వంతు విమానాలను మాత్రమే నడిపిస్తోంది. 119 విమానాలకు గాను కేవలం 41 విమానాలు మాత్రమే ఎగురుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి తోడు 24 శాతం వాటా ఉన్న ఎతిహాద్ తన వాటాను అమ్మేందుకు నిర్ణయించుకుంది. దీంతో మార్కెట్లో జెట్ ఎయిర్వేస్ షేర్లు పడిపోయాయి.
జెట్ ఎయిర్వేస్ను కష్టాలు వెంటాడుతున్నాయి. లీజు చెల్లించలేక మరిన్ని విమానాలు జెట్ నిలిపివేసింది. దీంతో కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్లో జెట్ షేర్లు ఏడు శాతం వరకు పతనమయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన జెట్ షేర్లు కాసేపటికే మరింత దిగజారాయి. ఒక దశలో బీఎస్ఈలో 6.59శాతం నష్టంతో రూ. 213.95 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఎన్ఎస్ఈలో 6.93 శాతం నష్టంతో రూ. 213.35 కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జెట్ షేరు విలువ 5.15శాతం నష్టంతో రూ. 217.45గా కొనసాగింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 218.05 వద్ద కొనసాగింది. ఇది 4.89 శాతం నష్టం.
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం: చేతులెత్తేసిన ఎతిహాద్, ఎస్బీఐకి ఆఫర్: విమానాల భద్రతపై ఆందోళన
ఇదిలా ఉండగా, జెట్ ఎయిర్వేస్కు చెందిన కొన్ని విమానాలను స్పైస్ జెట్ విమానయాన సంస్థ లీజుకు తీసుకోనుందని తెలుస్తోంది. స్పైస్ జెట్ షేర్లు బుధవారం 7.2 శాతం పెరిగాయి. డిసెంబర్ 18వ తేదీ తర్వాత అత్యధిక శాతం పెరుగుదల ఇదే.
కొద్ది రోజుల క్రితం ఇథియోపియాలో విమాన ప్రమాదం జరిగి 157 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పైస్జెట్కు చెందిన 12 బోయింగ్ సీవో 737 ఎంఏఎక్స్ 8 విమానాలు నిలిపివేశారు ఈ నేపథ్యంలో నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్కు సంబంధించిన కొన్ని విమానాలను తీసుకునేందుకు స్పైస్ జెట్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.
కాగా, జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వట్లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే విమానాల భద్రత ప్రమాదంలో పడుతుందని పైలట్లు వాపోతున్నారు. మార్చి చివరికల్లా వేతనాలు చెల్లించకపోతే ఏప్రిల్ 1 నుంచి విధులకు హాజరు కాబోమని చెప్పారు. జెట్ ఎయిర్వేస్ సంక్షోభంలోనే కొనసాగితే 23వేల మంది ఉద్యోగుల పరిస్థితి అంధకారంలో పడనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.