ఎరిక్సన్కు బకాయి చెల్లింపు ఎఫెక్ట్, అనిల్ అంబానీ కంపెనీ షేర్ల జోరు
ముంబై: ఎరిక్సన్ కంపెనీకి బకాయిలు చెల్లించిన నేపథ్యంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ షేర్లు లాభాల బాటపట్టాయి. మంగళవారం నాడు ట్రేడింగ్లో కంపెనీ షేర్లు 10 శాతానికి పైగా లాభాల్లో కనిపించాయి. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 10 శాతం లాభంతో రూ. 4.4 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్ గ్రూప్నకు చెందిన ఇతర కంపెనీలు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ పవర్, హోమ్ ఫైనాన్స్, నావెల్, నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.
అన్నా, వదినలు ఆదుకున్నారు.. థ్యాంక్స్: ఫ్యామిలీ వ్యాల్యూపై అనిల్ అంబానీ
ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత ఆర్కామ్కు ఇదే అతిపెద్ద లాభం. మంగళవారం నాడు బీఎస్ఈలోని అత్యధిక లాభం పొందిన సంస్థ ఆర్కామ్. అలాగే బీఎస్ఈ టాప్ 500 ఇండెక్స్లో కూడా నిలిచింది. గత కొద్ది రోజులుగా ఆర్కామ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎరిక్సన్కు బకాయిలు, వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.550 కోట్లు చెల్లించేందుకు ఆర్కాంకు సుప్రీం కోర్టు మార్చి 19 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా డబ్బులు చెల్లించకుంటే జైలుకు వెళ్తారని కోర్టు హెచ్చరించింది. అనిల్ అన్న ముఖేష్ అంబానీ కష్టకాలంలో తమ్ముడ్ని ఆదుకున్నారు. ఆర్కామ్ కష్టాల నుంచి గట్టెక్కడంతో షేర్లు జోరందుకున్నాయి.
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 83 పాయింట్ల లాభంతో 38,167 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,500 వద్ద ట్రేడ్ అయ్యాయి. రూపాయి స్వల్పంగా 2 పైసలు విలువ కోల్పోయి 68.55 ట్రేడింగ్ను మొదలుపెట్టింది. ఆ తర్వాత బలపడి 9.45 సమయంలో 68.42 వద్ద ట్రేడవుతోంది.