స్విస్ బ్యాంకుల్లో సొమ్ము దాచిన కేసులో ఇరుకున్న చందమామ ఓనర్లు !
చందమామ.. ఒకప్పుడు అత్యంత ఫేమస్ పిల్లల కథల పుస్తకం. పేరుకు పిల్లల పుస్తకమే అయినా ఇంటిల్లిపాదీ దీని కోసం ఆతృతగా ఎదురుచూసేవారు. ఏడు దశాబ్దాల పాటు సేవలు అందించిన చందమామా తర్వాతి రోజుల్లో వివిధ కారణాలతో మూతబడింది. 12 భాషల్లో లక్షలాది మంది చదువర్లను ఆకట్టుకున్న చందమామ.. పుష్కర కాలం క్రితం చేతులు మారింది. తాజాగా చందమామ కొత్త ప్రమోటర్లు స్విస్ బ్యాంకుల్లో సొమ్ము దాచిన కేసులో ఇరుక్కున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
చందమామ మ్యాగ్జైన్ను 1947లో టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లు బి నాగిరెడ్డి, చక్రపాణి కలిసి ప్రారంభించారు. కొడవగంటి కుటుంబరావు ఈ పుస్తకానికి 28 ఏళ్ల పాటు ఎడిటర్గా వ్యవహరించారు. ఆయనే కథలు రాస్తూ.. కొత్త వాళ్లను ప్రోత్సహిస్తూ ఎంతోకాలం పాటు చక్కగా నిర్వహించారు చందమామ పుస్తకాన్ని. అమ్మమ్మలు, నాన్నమ్మలు కథలు చెప్పిన రీతిగా పిల్లలకు అర్థమయ్యేలా బొమ్మలతో సహా చెప్పడం చందమామ గొప్పతనం. మొదట తెలుగు, తమిళంలో మొదలైన ఈ పుస్తకం ఆ తర్వాత 12 భాషల్లో ప్రచురితమైంది.
2007లో చేతులు మారింది
2006 కంటే ముందే చందమామ మ్యాగ్జైన్లో మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఎండి వినోద్ సేధీకి, బి నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు ఇందులో 60 శాతానికి పైగా వాటా ఉండేది. మిగిలిన వాటా పబ్లిషర్ విశ్వనాధ రెడ్డి సహా టాటా, డాబర్ గ్రూప్ వంటి వాళ్లకు కూడా ఉండేదంటారు. ఆ తర్వాతి రోజుల్లో
వాల్డ్ డిస్నీ సహా వివిధ సంస్థలు అప్పట్లో చందమామను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. కనీసం ఇందులో వాటా తీసుకోవాలని తాపత్రయపడ్డారు. అయితే చివరకు ముంబైకి చెందిన జియోడిసిక్ అనే సంస్థ చందమామ హక్కులను దక్కించుకుంది. ఈ పిల్లల పుస్తకాన్ని కొద్దిగా డిజిటలైజ్ కూడా చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపిస్తూ 2013లో పుస్తక ముద్రణను ఆపేసింది జియోడిసిక్ సంస్థ. అలా ఆరుదశాబ్దాల పాటు సేవలను అందించిన చందమామ మబ్బుల చాటుకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెబ్ సైట్ను కూడా పట్టించుకోవడం మానేశారు.
తాజాగా స్విస్ కేసుల్లో..
జియోడిసిక్ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిన వ్యాపారాన్ని కూడా నిర్వహించుకునే స్థితిలో లేక మూతపడింది. తాజాగా జియోడిసిక్కు స్విట్జర్లాండ్లో ఖాతాలు ఉండడం, వాటికి సంబంధించిన డేటాను భారత్కు ఇచ్చేందుకు స్విస్ ప్రభుత్వం మార్చి 5న అంగీకరించింది. ఈ సంస్థ డైరెక్టర్లు అయిన ప్రశాంత్ శరద్ ములేకర్, పంకజ్ కుమార్ ఓంకార్, కిరణ్ కులకర్ణికి కూడా నోటీసులు జారీ చేశారు. దీనిపై 30 రోజుల్లో డైరెక్టర్లు స్పందించేందుకు అవకాశం ఉంది.
భారత స్టాక్ మార్కెట్లలో లిస్టైన జియోడిసిక్ సంస్థ 2014 నుంచి నిర్వాహణను కూడా నిలిపేసింది. స్టాక్ మార్కెట్కు సమాచారం ఇవ్వడంలో విఫలం కావడంతో ఈ స్టాక్లో ట్రేడింగ్ను కూడా 2014లోనే నిలిపివేశాయి స్టాక్ ఎక్స్ఛేంజీలను
ఇప్పటికే రూ.812 కోట్ల స్కామ్లో జియోడిసిక్ డైరెక్టర్లను పోలీసులు గతంలోనే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
చందమామ పరిస్థితేంటి
ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం చందమామ బ్రాండ్ విలువ సుమారు రూ.25 కోట్ల వరకూ ఉంది. ఇది ప్రస్తుతం అధికారిక లిక్విడేటర్ ఆధీనంలో ఉంది. ఈ బ్రాండ్ను అమ్మి సంస్థ చేసిన అప్పులు తీర్చాలని కోర్ట్ భావిస్తోంది.