స్టాక్ మార్కెట్ సూచీలు మార్చి సిరీస్ ఫ్యూచర్స్ మొదటి రోజున లాభాల్లో ముగిశాయి.
స్టాక్ మార్కెట్ సూచీలు మార్చి సిరీస్ ఫ్యూచర్స్ మొదటి రోజున లాభాల్లో ముగిశాయి. మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడి నిఫ్టీ 10800 పాయింట్లపైన ముగిసింది. వారంతంలో ఉత్సాహంగా మొదలైన మార్కెట్లు అదే జోరును ఆఖరి వరకూ కొనసాగించాయి. కొద్దిగా మిడ్ సెషన్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆఖరికి పటిష్టంగా ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మీడియా, మెటల్ రంగ కౌంటర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో లాభాల్లో క్లోజయ్యాయి. నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 10863 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 196 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 254 పాయింట్లు లాభంతో క్లోజయ్యాయి.
జీ ఎంటర్టైన్మెంట్, హెచ్ పి సి ఎల్, యెస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌసింగ్ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిచాయి. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో చేరాయి.
పాక్ టెన్షన్స్ తగ్గినట్టేనా
పాకిస్తాన్లో బందీగా ఉన్న ఫైటర్ జెట్ పైలెట్ అభినందన్ను పాక్ విడుదల చేస్తున్న నేపధ్యంలో మార్కెట్లు కాస్త రిలీఫ్ ఫీలయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు వీడిపోవడం ఫైనాన్షియల్ మార్కెట్లకు కలిసొచ్చింది. ఇది కూడా మార్కెట్ ర్యాలీకి మరో కారణం.
అన్ని సెక్టార్లూ
ఉదయం నుంచి ఆఖరి సెషన్ వరకూ అన్ని సెక్టోరల్ ఇండెక్స్లూ లాభాల్లోనే ఉన్నాయి. ఆఖరి వరకూ అదే జోరు కొనసాగింది. ప్రధానంగా పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఐటి రంగ కౌంటర్లలో జోరు నమోదైంది.
ప్రభుత్వ బ్యాంకుల హవా
ప్రభుత్వ బ్యాంకుల షేర్లలో ఈ రోజు అనూహ్యమైన లాభాలు నమోదయ్యాయి. పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్లో ఉన్న అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. ఓరియంట్ బ్యాంక్ 12 శాతం, యూనియన్ బ్యాంక్ 8 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 7, సిండికెట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి. ఎస్బీఐ, జెకె బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కూడా 2-3 శాతం వరకూ పెరిగాయి.
జెట్ ఎయిర్ ఛైర్మన్ డౌన్
జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయెల్ తన పదవి నుంచి దిగిపోయేందుకు ఒప్పుకోవడంతో స్టాక్ పరుగులు తీసింది. రుణ పునర్వ్యవస్థీకరణకు ఆయన ఇంతకాలం ఏదో ఒక అడ్డు చెప్తూ వస్తున్నారు. దీంతో రుణదాతలంతా ఏకమై గోయెల్కు వ్యతిరేకంగా మారారు. ఇక చేసేదిలేక గోయెల్ తప్పుకోబోతున్నారు. ఈ కారణంగా స్టాక్ 5.5 శాతం లాభాలతో రూ.235 దగ్గర క్లోజైంది.
ఎయిర్టెల్ డౌన్
ఇప్పటికే సుమారు రూ.లక్ష కోట్ల అప్పులో కూరుకుపోయిన భారతి ఎయిర్టెల్ తాజాగా మరో రూ.32000 కోట్లు సమీకరించడానికి సిద్ధమైంది. రూ.25 వేల కోట్లు రైట్స్ ఇష్యూ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం 67 షేర్లు ఉన్న వాళ్లకు 19 షేర్లను రూ.220 చొప్పున ఇవ్వాలనుకున్నారు. అయితే ఇది అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మొగ్గుచూపలేదు. సుమారు 5 శాతం వరకూ నష్టపోయిన స్టాక్ చివరకు 3.5 శాతం లాస్తో రూ.307 దగ్గర క్లోజైంది.
పేపర్ షేర్స్
కాగితపు షేర్లలో చాలకాలం తర్వాత జోరందుకున్నాయి. ఈ సెక్టార్లో ఉన్న దాదాపు అన్ని షేర్లూ కనీసం 2-3 శాతం లాభపడ్డాయి. స్టార్ పేపర్, శ్రేయాన్స్ పేపర్ 20 శాతం, వెస్ట్ కోస్ట్ పేపర్ 15 శాతం, జెకె పేపర్ 10 శాతం లాభపడ్డాయి. ఇంటర్నేషనల్ పేపర్, తమిళనాడు న్యూస్ప్రింట్, శేషసాయి పేపర్, బల్లార్పూర్ 5 శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.
సిమెంట్ షేర్స్ గెయిన్
దక్షిణాది రాష్ట్రాల్లో డిమాండ్తో పాటు ధరలు కూడా పెరుగుతున్న నేపధ్యంలో సిమెంట్ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. మేజర్ సిమెంట్ కంపెనీల్లో ఏసిసి 4.2 శాతం, హైడల్బర్గ్ 3.5 శాతం, ప్రిజం సిమెంట్, రెయిన్ ఇండస్ట్రీ, రాంకో సిమెంట్ స్టాక్ 3 శాతం వరకూ పెరిగాయి.
అదే మినీ సిమెంట్ స్పేస్లో సాగర్ సిమెంట్స్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, అంజనీ పోర్ట్ ల్యాండ్ స్టాక్స్ 5 శాతం వరకూ పెరిగాయి.
స్మాల్ క్యాప్ షాకర్స్
స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఫోర్స్ మోటార్స్ 16 శాతం, రిలయన్స్ పవర్ 15 శాతం, గుజరాత్ అల్కలీస్ 12 శాతం, ఫోర్బ్స్ అండ్ కంపెనీ 10 శాతం పెరిగాయి. అదే బాటలో ఎస్ఎంఎల్ ఇసుజు 20 శాతం, లింకన్ ఫార్మా 18 శాతం లాభపడ్డాయి.
సోమవారం సెలవు
శివరాత్రి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు.