జొమాటో బిగ్ షాక్: నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో 5వేల రెస్టారెంట్ల తొలగింపు
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన జాబితా నుంచి 5వేల రెస్టారెంట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రుచి శుభ్రతపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడం ఆ రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు లేకపోవడంతో జాబితా నుంచి ఆ రెస్టారెంట్లను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా జొమాటో 150 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆ నగరాల్లోని పలు రెస్టారెంట్లను తొలగించింది.
రోజుకు 400 రెస్టారెంట్లను తాము తమ జాబితాలో చేరుస్తున్నట్లు జొమాటో సీఈఓ మోహిత్ గుప్తా చెప్పారు. మరి భారీ స్థాయిలో రెస్టారెంట్లను జాబితాలో చేరుస్తున్నప్పుడు అవి అంతే స్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం జొమాటోలో ఉన్న 80వేల రెస్టారెంట్లను నాణ్యతా ప్రమాణాలపై పునఃసమీక్ష చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే తమ సంస్థకు చెడ్డ పేరు వస్తుందని వెల్లడించారు. అప్పుడు సంస్థ కోసం వెచ్చించిన కష్టమంతా వృథాగా పోతుందని అభిప్రాయపడ్డారు.
ఇక తమ జాబితాలో ఉన్న రెస్టారెంట్లను వాటి యాజమాన్యాలకు జొమాటో అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వివరించారు మోహిత్ గుప్తా. ఇందులో భాగంగా రెస్టారెంట్లకు సరైన లైసెన్సులు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెబుతున్నట్లు స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల గత ఆరునెలల్లో కంప్లయింట్లు ఉన్న 30వేల రెస్టారెంట్లను గుర్తించి తప్పులను సవరించగలిగామని వెల్లడించారు. ప్రస్తుతం జొమాటో సంస్థ తన ఆన్లైన్ ప్లాట్ ఫాం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 1.4 మిలియన్ రెస్టారెంట్లను కవర్ చేస్తుండగా.... అవన్నీ 24 దేశాల్లో ఉన్నట్లు సీఈఓ చెప్పారు. నెలకు 65 మిలియన్ కస్టమర్లకు తమ సేవలందిస్తున్నట్లు మోహిత్ గుప్తా చెప్పారు.