అక్కడ చదివితే రూ.25 లక్షల జాబ్ గ్యారెంటీ ! ఇండియాలోనే ఎక్కడో తెలుసా?
ఏడెనిమిదేళ్ల క్రితం వరకూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ హంగామా అంతా ఇంతా ఉండేది కాదు. అటు ఐఎస్బి, ఇటు ఐఐటిల్లోని విద్యార్థులను వెతికి పట్టుకునేందుకు దేశ, విదేశీ సంస్థలు క్యూకట్టేవి. అప్పట్లోనే నెలకు రూ.2-3 లక్షల మినిమం శాలరీని ఆఫర్ చేయడం మనమంతా చూశాం. అయితే మాంద్యం తర్వాత ఆ పరిస్థితులు చాలా వరకూ మారిపోయాయి. కంపెనీలు, కాలేజీలు కూడా ఎగబడి ఇప్పుడు చెప్పడానికి మొహం చాటేస్తూ వచ్చాయి.
ఈ మధ్య కొద్దిగా సీన్ ఛేంజ్ అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో మన కంపెనీలు ఎదగడం, విదేశీ సంస్థలు మన టాలెంట్పై పూర్తిగా నమ్ముతున్న నేపధ్యంలో మళ్లీ బూమ్ మొదలైంది. తాజాగా ఢిల్లీలో ఉన్న ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో చదువుతున్న విద్యార్థులకు భారీ స్థాయిలో ఆఫర్లు వచ్చి పడ్డాయి. అక్కడి విద్యార్థులకు మినిమంలో మినిమం ఏడాదికి రూ. 23.2 లక్షల యావరేజ్ శాలరీ వచ్చిందని సదరు స్కూల్ ప్రకటించింది. ఇది గత ఏడాది వచ్చిన ఆఫర్ల మినిమం శాలరీతో పోలిస్తే రూ.2.1 లక్షలు అధికమని చెబ్తోంది.
ఎఫ్ఎంఎస్ విద్యార్థుల్లో ఉన్న టాప్ 100 మందికి యావరేజ్ శాలరీ రూ.27 లక్షలకు పెరిగింది. నిరుడు ఇది రూ.26 లక్షలు ఉండేది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులకు 18 శాతం అధికంగా వేతనాలు ఇచ్చి కంపెనీలు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. ఇప్పుడు వాళ్ల మినిమం ప్యాకేజీ కూడా రూ.25.1 లక్షలకు చేరిందట.
విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్ చేసిన కంపెనీల్లో ప్రధానంగా నెస్లే, హిందుస్తాన్ యునిలివర్, ఐటీసీ, రెకిట్, బీఎండబ్ల్యు, డెలాయిట్, మెకెన్సీ, బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ వంటివి ఉన్నాయి. వీటితోపాటు పేర్లు వెల్లడించేందుకు ఇష్టపడని కొన్ని టాప్ మేనేజ్మెంట్ సంస్థలు కూడా వచ్చినట్టు కాలేజ్ ప్లేస్మెంట్ సెల్ తెలిపింది.
ఈ-కామర్స్, ఐటీ, ఆపరేషన్ రోల్స్కు సంబంధించిన జాబ్స్లో సుమారు 150 శాతం వరకూ జంప్ ఉందని కాలేజ్ చెబ్తోంది. అమెజాన్, యుబర్, పేటిఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ఆఫర్లు 54 శాతం పెరిగాయని ఎఫ్ఎంఎస్ వెల్లడించింది.
ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ స్టడీస్లో ఉన్న మొత్తం 216 మంది విద్యార్థుల్లో 198 మంది క్యాంపస్ ప్లేస్మెంట్లకు హాజరైతే వాళ్లకు 210 ఆఫర్లు వచ్చాయి. మిగిలిన వాళ్లు వ్యాపారాలు చేసుకునేందుకు మొగ్గుచూపడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనలేదని చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ టాప్ మేనేజ్మెంట్ స్కూళ్లపై దృష్టి మళ్లుతోంది. అక్కడి విద్యార్థులకు ఇచ్చే భారీ ప్యాకేజీలపై చర్చ నడుస్తోంది.