ఎన్నికల వేళ ఉద్యోగస్తులకు వరాల జల్లు: 3 శాతం డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం
ఢిల్లీ: ఎన్నికల వేళ మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు వరాల జల్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3శాతం డీఏను పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్ మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. ఇందుకు గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే ఇది జనవరి 1, 2019 నుంచి వర్తిస్తుంది. ఉద్యోగస్తులతో పాటు పెన్షనర్లు కూడా దీని నుంచి లబ్ధి పొందనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ పెంపు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఉ 9శాతంగా ఉంది. ఇప్పుడు దీనిపై 3 శాతం పెంచుతున్నట్లు సమావేశం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఇది జనవరి 1, 2019 నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు వస్తుందని ఆయన స్పష్టంచ చేశారు.
ఇక కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో 48.41 లక్షలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. ఇక ఏడవ వేతన సంఘం ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఉద్యోగులకు పెన్షనర్లకు డీఏ పెంచడం జరిగిందని జైట్లీ చెప్పారు. అయితే ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా ఓట్లకోసమే మోడీ సర్కార్ ఇలాంటి కార్యక్రమాలకు తెరదీస్తోందని విపక్షాలు ధ్వజమెత్తాయి.