ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెంచేందుకు భారీ ప్రణాళిక
న్యూఢిల్లీ : వాతావరణ మార్పులకు ప్రధాన కారణం కాలుష్యం. పెట్రోల్, డీజిల్ వాహనాలు గణనీయంగా పెరగడంతో వాతావరణం కలుషితమవుతోంది. దీంతో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి. ఇందుకోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే వాహనాల బదులు సైకిళ్ల వినియోగం .. పెట్రో, డీజిల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ కారు కొంటే రూ.50 వేల రిబేట్
ఏదైనా విపత్తు సంభవిస్తుందంటే దానికి అనుగుణంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాతావరణ మార్పులకు కారణమైన పెట్రోల్, డీజిల్ వాహనాల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని కోరుతోంది. మాములుగా చెబితే జనం పట్టించుకోరని .. ఎలక్ట్రిక్ వాహనం కోనుగోలు చేస్తే రూ.50 వరకు రిబేట్ ఇస్తామని ఆఫర్ ప్రకటించింది. దీంతో తాము చెల్లించాల్సిన నగదు తగ్గడంతోపాటు భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఇసుమంత ఆలోచన వారిలో కలుగుతుందని అంచనా వేస్తోంది.
ఐదేళ్లలో 15 శాతం కార్ల విక్రయం ..?
వినియోగదారులకు రిబేట్ ఇవ్వడంతోపాటు లోన్ ను కూడా తక్కువ వడ్డీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిని 'ప్రియారిటీ సెక్టార్ లెండింగ్‘ అంటారని వెల్లడించాయి. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యల్లో ఒక భాగమని పేర్కొన్నాయి. తాము చేపట్టిన ఈ చర్యల వల్ల వచ్చే ఐదేళ్లలో మొత్తం 15 శాతం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వెల్లడించింది. దీని కోసం ఒక కేబినెట్ నోటు కూడా రూపొందించినట్టు గుర్తుచేశాయి.
ధరల్లో మార్పులేదు ...
పెట్రో, డీజిల్ కార్ల ధరలు, ఎలక్ట్రిక్ కార్ల ధరలు సమానంగా ఉంటున్నందున .. ఎలక్ట్రిక్ కార్లకే ప్రోత్సాహకాలను కేంద్రం అందిస్తోంది. దీంతో కొనుగోలుదారుడు సమాన ధర ఉన్న ఎలక్ట్రిక్ కారు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేస్ కింద ఎంపిక చేసిన నగరాల్లో నిర్దేశిత కాలంలో ఈ ప్లాన్ ను అమలు చేస్తామని స్పష్టంచేసింది. ఎలక్ట్రిక్ కార్లకు ప్రోత్సాహకాలకు సంబంధించి బ్యాటరీ పరిమాణం, వెహికిల్ మోడల్ ను బట్టి ఉంటుందని వెల్లడించాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన చార్జింగ్ సౌకర్యం కల్పించడం కోసం మౌలిక సదుపాయాల కల్పన విస్రుతంగా అవసరమని అభిప్రాయపడ్డాయి.
పార్కింగ్ ప్రీ ...
ఎలక్ట్రిక్ కారును వినియోగదారుడు ఎందుకు కొనుగోలు చేయాలనే అంశంపై సమీక్షించిన కేంద్రం .. ఆ కార్లకు ప్రీ పార్కింగ్ కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారుడు తమ కారుకు తక్కువ వడ్డీ .. రిబేట్ వస్తుందని భావిస్తాడు. దాంతోపాటు పార్కింగ్ కూడా లేకపోవడంతో ఫీజు బాదుడు తప్పుతుందనే భావనతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ కొన్ని ప్రదేశాల్లో .. కొన్ని మోడల్ ఎలక్ట్రిక్ కార్లకు పార్కింగ్ ఫీజు కొంత మేర ఉండే అవకాశాలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది.
రిజిస్ట్రేషన్ ఫీ లేదు .. టాక్స్ లేదు ...
పార్కింగ్ ప్రీ ఓకే నా .. ఇంకా ఏమైనా కావాలని సదరు వినియోగదారుడి భావిస్తాడాని ఆలోచించిన కేంద్రం .. రిజిస్ట్రేషన్, పన్నులు కూడా రద్దుచేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో తమ జేబు నుంచి మరింత నగదు జారీపోయే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ రెండు అంశాలు కూడా తమకు కలిసి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి దిగుమతి చేసుకునే ముడిసరుకు డ్యూటీలను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించిన సంగతి తెలిసిందే.
రిబేట్ ఎందుకంటే ...
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కోసం ప్రభుత్వం ఎందుకు ఇన్ని వెసులుబాట్లు కల్పించాలనే ప్రశ్న రావొచ్చు. దానికి సమాధానం మాత్రం 2017 కంటే 2018లో ఎలక్ట్రిక్ కార్ల కోనుగోలు తగ్గడమే. 2017లో ఎలక్ట్రిక్ వాహనాలు 25 వేలు అమ్ముడుపోయాయి. అందులో 23 వేల వాహనాలు టూ వీలర్స్ ఉన్నాయి. కార్లు మాత్రం 2 వేల వాహనాలు సేల్స్ అయ్యాయి. అయితే 2018 వచ్చేసరికి మొత్తం వాహనాలు 56 వేలు విక్రయించారు. ఏడాదిలో వాహనాల సంఖ్య పెరిగింది. కానీ అందులో 54 వేల 800 టూవీలర్స్ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే కేవలం 1200 వాహనాలు మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. అంటే ఏడాదికి కార్ల విక్రయాలు 800 పడిపోయాయి. దీంతో మేల్కొన్న కేంద్రం .. దిద్దుబాటు చర్యలు ప్రారంభించి వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివిధ రాయితీలను ప్రకటించింది.