చందాకొచ్చార్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు, ఐసీఐసీఐ బ్యాంక్ నిబంధనల ఉల్లంఘన
ముంబై: ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను ఐసీఐసీఐ విచారణ కమిటి దోషిగా తేల్చింది. ఆమె ఐసీఐసీఐ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా విచారణ కమిటి తేల్చింది. రిటైర్డ్ జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణన్ కమిటీ విచారణ జరిపింది.
ఈ విచారణలో చందా కొచ్చార్ ఐసీఐసీఐ బ్యాంకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, వివాదాస్పద ప్రయోజనాల కోసం పని చేశారని తేల్చింది. ఈ నేపథ్యంలో చందా కొచ్చార్కు చెల్లింపులను బ్యాంకు నిలిపివేసింది. ఆమెను తొలగించింది. ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదయింది.
ప్రత్యేక కారణంతోనే చందా కొచ్చార్ బ్యాంకు నుంచి బయటకు వెళ్లినట్లు పరిగణిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మేరకు వెల్లడించింది. బ్యాంకు అంతర్గత విధానాలను కొచ్చర్ ఉల్లంఘించారని మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని విచారణ కమిటీ తన నివేదికలో వెల్లడించిన అనంతరం బ్యాంకు పై విధంగా స్పందించింది.
స్వప్రయోజనాల విషయంలో కొచ్చార్ ప్రవర్తనా నియమావళిని, బ్యాంకు విధానాలను ఉల్లంఘించారని ఐసీఐసీఐ అంతర్గత విచారణ నివేదిక తెలిపింది. బోనస్తో సహా ఇతర ప్రయోజనాలకు సంబంధించిన చెల్లింపులను నిలిపివేయనున్నామని బ్యాంక్ తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకు మంజూరు చేసిన రూ.3,250 కోట్ల రుణం వెనుక అప్పటి సీఈఓ చందా కొచ్చార్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఆ అంశంపై దర్యాప్తు చేయడానికి బ్యాంకు బోర్డు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణలో చందా కొచ్చార్ నియమాలు ఉల్లంఘించినట్లుగా తేలింది.