సోల్ ఈవీ తాళం చెవిని ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన కియా మోటార్స్
అనంతపురం: సోల్ ఈవీ పేరుతో కియా మోటార్స్ తయారు చేసిన విద్యుత్ వాహన తాళం చెవిని ఆ సంస్థ ఎండీ మంగళవారం ఏపీ ప్రభుత్వానికి అందించారు. అంతకుముందు కియా సంస్థ ది నోరో ఈవీ పేరుతో ఓ విద్యుత్ వాహనాన్ని ఏపీ ప్రభుత్వానికి అందించింది. దీనికి అదనంగా సోల్ ఈవీని అందించింది.
ఏపీలో విద్యుత్తు వాహనాలకు అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి వీటిని వినియోగించనున్నారు. అనంతపురం జిల్లా ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ ప్రీ ప్రొడక్షన్ వేడుకలో ఎండీ కె షిమ్ సోల్ ఈవీ తాళం చెవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు.
కియా మోటార్స్ ఉత్పత్తి చేసే సోల్ హ్యాచ్కు ఇది విద్యుత్తు వేరియంట్. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో దీనిని వినియోగిస్తున్నారు. ఈ కారు పాత వెర్షన్ కంటే కొత్త వెర్షన్ మెరుగైన మైలేజీ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జి చేస్తే ఈ కారు 450 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. కారులో 64 కేడబ్ల్యూహెచ్ లిక్విడ్ కూల్డ్ లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీని వినియోగించారు. ఈ కారు విద్యుత్తు మోటార్ 395 టార్క్ వద్ద 198 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది.