జరభద్రం: ఫుడ్ యాప్స్ మీ జేబులను కొల్లగొడుతున్నాయి
ఒకప్పుడు ఆఫీసుకు వెళ్లాలంటే చీకట్లోనే నిద్రలేచి ఉదయం టిఫిన్ చేసుకుని ఆ తర్వాత భోజనం తయారు చేసుకుని రెడీ అయి ఆఫీసులకు బయలు దేరేవాళ్లం. కానీ ఇప్పుడు ఆలస్యంగా నిద్రలేస్తున్నాం. టిఫెన్ తయారు చేసే పనిలేదు, భోజనం వండుకునే అవసరం రావడం లేదు. హడావుడిగా కాకుండా ప్రశాంతంగా ఆఫీసులకు బయలుదేరుతున్నాం. ఇలాంటి మార్పు ఎందుకొచ్చిందో అందరికీ తెలుసు. టిఫిన్, భోజనం తయారు చేసుకునే పనిలేదు కాబట్టి ఆఫీసులకు త్వరగా వెళ్లగలుగుతున్నాం. ముఖ్యంగా నగరవాసులకు ఈ వెసులుబాటు కల్పించాయి ఫుడ్ యాప్స్.
ఉద్యోగులకు వరంలా మారిన ఫుడ్ యాప్స్
నగరవాసులకు, ఉద్యోగులకు ఒక వరంలా మారాయి ఫుడ్ యాప్స్. ఏ సమయంలోనైనా సరే స్మార్ట్ ఫోను తీసుకుని ఒక్క క్లిక్ ఇస్తే చాలు అనుకున్న ఐటెం నిమిషాల్లో తలుపు ముందర ఉంటుంది. ఫుడ్ యాప్స్ వచ్చాక వంట వండుకోవడం అనే విషయాన్ని యువత మరిచిపోతోంది. స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా, ఊబెర్ ఈట్స్ లాంటి సంస్థలు ఉండగా వంట ఎందుకు దండగా అనుకుంటోంది యువత. అయితే యువత ఇది వరం అని భావిస్తున్నప్పటికీ ఈ యాప్స్ డబ్బులు కొల్లగొడుతున్నాయనే విషయం గ్రహించలేకపోతున్నారు.
వంట చేసే సమయం ఆదా అవుతుంది
ఫుడ్ యాప్స్తో ఉద్యోగస్తులకు సమయం మిగలడంతో పాటు స్ట్రెస్ కూడా తగ్గుతోందని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ శ్రీవాత్స్ చెబుతున్నారు. రోజంతా పనిచేసిన ఉద్యోగికి ఇంటికి వచ్చి వంట చేయాలంటే అలసట ఉంటుందని చెప్పిన శ్రీవాత్స్... అలాంటి సమయాల్లో ఫుడ్ యాప్స్లో ఆహారం ఆర్డర్ ఇచ్చి రిలాక్స్ అవుతున్నారని చెప్పారు. అయితే యువత మాత్రం తమకు తెలియకుండానే దీనిపై ఎంతో ఖర్చు చేస్తోంది. వారంలో ఏడురోజులుంటే ఒక్క ఆదివారం తప్పితే మిగతా రోజుల్లో యువత ఫుడ్ యాప్స్నే ఆశ్రయిస్తోంది.
బ్యాచిలర్ ఉద్యోగులే ఎక్కువగా ఫుడ్ యాప్స్ వినియోగిస్తున్నారు
ఇక ఇంటిని వదిలి బ్యాచిలర్స్ రూంలో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారే ఎక్కువగా ఫుడ్ యాప్స్ పై ఆధారపడుతున్నారు. ఆఫీసుకు ఎప్పుడు వెళతారో... ఎప్పుడు వస్తారో తెలియని బ్యాచిలర్స్ ఆకలి అయితే ఫుడ్ యాప్స్ వినియోగించి ఆన్లైన్లో ఆహారం తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్లో ఆహారం ఆర్డరు ఇచ్చి భోజనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పినప్పటికీ యువత వినడం లేదు. వంట చేసుకోవాలంటే గ్యాస్ ఉండాలి.. వంటకు కావాల్సిన కూరగాయలు కొన్నుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వంట చేయాలి.... ఇలా అన్ని కొనేబదులు ఒక్క క్లిక్తో భోజనం తలుపు ముందు ఉంటుందని భావిస్తోంది యువత. అంతేకాదు భోజనం ఖర్చు రూ.100 అయితే వంటకు కావాల్సిన వస్తువులు అంతకు మించి అవుతున్నాయనే సమాధానం యువత ఇస్తోంది.
టైమ్ను క్యాష్ చేసుకుంటున్న ఫుడ్ యాప్స్
ఇక డెలాయిట్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. యువతకు సమయం చాలా ముఖ్యమైనది. దీన్నే క్యాష్ ఆన్లైన్ ఫుడ్ యాప్స్ క్యాష్ చేసుకుంటున్నాయని సర్వే వెల్లడించింది. మారుతున్న జీవన ప్రమాణాలతో యువత చాలా బిజీగా గడుపుతోంది. సమయాభావం లేకపోవడంతోనే ఫుడ్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ కారణంగానే రెడీ టు ఈట్ అనే సంస్థ ఏడాదిలోనే 28శాతం రెట్టింపు చూసిందని సర్వే చెబుతోంది. అంతేకాదు యువత తమకు తెలియకుండానే ఈ ఆన్లైన్ ఫుడ్ యాప్స్ ద్వారా వారానికి రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఖర్చు చేస్తోందని డెలాయిట్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు డెలివరీ ఛార్జి కూడా ఉంటుందని అది పెద్ద మొత్తంగా కనిపించదని వెల్లడించింది. ఒక డెలివరీ ఛార్జి కోసం రూ. 30 వెచ్చిస్తున్న యువత వారానికి ఐదుమార్లు ఆర్డరు ఇచ్చినా అది నెలకు రూ. 600 అవుతుందని సంస్థ పేర్కొంది.
మొత్తానికి యువత బిజీ లైఫ్ను క్యాష్ చేసుకుని ఫుడ్ యాప్స్ వారి జేబులను కొల్లగొడుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.