ఫ్లాష్ ఫ్లాష్ ... ఇక పై మీ ఇంటికే బ్యాంకింగ్ సేవలు ఎలాగో చూద్దామా?
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించడానికి ప్రభుత్వ రంగంలోని ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు సిద్దం అవుతోంది. కోట్లాది ప్రజలకు ఈ సేవలను చేరువ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంది.
ఆగస్టు 21
ఆగస్టు 21 నుంచి ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లావాదేవీలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. రుణాలు, క్రెడిట్ కార్డుల జారీ మినహా అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను ఐపిపిబి అందించనుంది.
పోస్టుమెన్లతో
మొబైల్ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, ఎటిఎం లేదా డెబిట్ కార్డుల సేవలు, డిపాజిట్ల సేకరణ తదితర సేవలు లభించనున్నాయి. తొలి దశలో 11,000 మంది పోస్టుమెన్లతో 650 శాఖల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు (ఐపిపిబి) సేవలను అందుబాటులోకి తేనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో
పోస్టు ఆఫీసులకు దగ్గరలోని మరో 3,250 సహ ప్రాంతాల్లోనూ ఈ సేవలను అందించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశంలోని 1.55 లక్షల తపాల శాఖల్లో ఐపిపిబి సేవలను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందించింది. ఇందులోనూ 1.3 లక్షల పోస్టు ఆఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
వాజ్ పాయ్
ఇవి పక్క గ్రామాలను కూడా చేరుకోగలవని, దీంతో దేశంలోని అన్ని గ్రామాల్లో ఐపిపిబి సేవలు అందుబాటులోకి తేవాలన్నది ప్రధాన యోచన. దీంతో 3 లక్షల తపాల శాఖ ఉద్యోగులు ఈ సేవల్లో భాగస్వాములు అవుతారు. మాజీ ప్రధాని వాజ్పాయ్ మరణం నేపథ్యంలో ఈ సేవల ప్రారంభం కొంత వాయిదా పడొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎలాంటి సేవలు ఉంటాయి?
వ్యక్తులు, చిన్న సంస్థల నుంచి పేమెంట్ బ్యాంకులు లక్ష రూపాయల వరకు డిపాజిట్లు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇతర బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయొచ్చు. ఇతర అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే రుణాలు ఇవ్వడం, క్రెడిట్ కార్డులను జారీ చేసే అధికారం ఉండదు.
పోస్టల్ పేమెంట్ బ్యాంకు
దీంతో ఇతర బ్యాంకులు, విత్త సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా పోస్టల్ పేమెంట్ బ్యాంకు తమ ఖాతాదారులకు రుణాలు, ఇతర విత్త సేవలు అందించడానికి వీలు కల్పించనుంది. లక్ష రూపాయల పరిమితి మించిన డిపాజిట్లను పోస్టు ఆఫీసు సేవింగ్ బ్యాంక్స్ (పిఒఎస్బి)కు బదిలీ చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పోస్టు ఆఫీసుల్లో రకరకాలైన 17 కోట్ల ఖాతాలు ఉన్నాయని, క్రమంగా వాటిని ఐపిపిబితో అనుసంధానం చేయనున్నామని అన్నారు. ఇప్పటికే రారుపూర్, రాంచీలో రెండు ఐపిపిబి శాఖలు పైలట్ ప్రాజెక్టులో భాగంగా విజయవంతంగా సేవలందిస్తున్నాయి.
ఛార్జీలు
పోస్టు ఆఫీసు వద్ద సేవలు పొందడానికి ఎలాంటి రుసంలు వసూలు చేయరు. ఇంటి వద్ద సేవలకు మాత్రం ప్రతీ లావాదేవీకి నగదు ఉపసంహరణ, డిపాజిట్కు రూ.25 చార్జీ చేస్తారు. డిజిటల్ పద్దతిలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు మినహా ఇతర చెల్లింపులకు ఒక్కో దానికి రూ.15 చార్జీ చేయనున్నారు.
డిపాజిట్లు
హెడ్ పోస్టు ఆఫీసు, సబ్ పోస్టు ఆఫీసు వద్ద నగదు డిపాజిటు పరిమితి లేదు. ఉపసంహరణను మాత్రం రూ.20,000కు పరిమితం చేశారు. బ్రాంచీ పోస్టు ఆఫీసు వద్ద డిపాజిట్లు రూ.5,000, అంతే మొత్తం ఉపసంహరణ పరిమితి ఉంటుంది. ఇంటి వద్ద సేవలకు డిపాజిట్లకు రూ.5,000, ఉపసంహరణకు అంతే మొత్తం అనుమతిస్తారు.