సీసీఐ దెబ్బ గూగుల్ అబ్బా
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 136 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 2012లో గూగుల్ పై అనుచిత వ్యాపార ధోరణుల కేసు దాఖలయింది. గూగుల్ కు చెందిన ఆల్ఫాబెట్ కంపెనీ వెబ్ సెర్చ్ లో, అడ్వర్టెయిజ్ మెంట్స్ లో పైచేయి సాధించేందుకు అనుచిత విధానాలు వినియోగించినట్టు తేలింది.
ఆన్లైన్ శోధన విషయంలో అక్రమ వ్యాపార విధానాల కారణంగానే సీసీఐ భారీ జరిమానాను విధించింది. మ్యాట్రిమొని.కామ్, కన్సూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీలు 2012లో గూగుల్ ఎల్ఎల్సీ, గూగుల్ ఇండియా, గూగుల్ ఐర్లాండ్ సంస్థలపై ఫిర్యాదు చేశాయి.
ఫిర్యాదును విచారణకు తీసుకున్న సీసీఐ సంస్థ గూగుల్ నమ్మకానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అనే నిబంధనను ఉల్లంఘించినందుకు గాను జరిమానా విధించాలని నిర్ణయించింది. గూగుల్ సంస్థకు విధించిన పెనాల్టీలో రూ.136 కోట్ల డబ్బు గూగుల్ భారత కార్యకలాపాల నుంచి వచ్చిన ఆదాయంలో 5 శాతం వరకూ ఉంది. ఇది గూగుల్ సంస్థకు పెద్ద విషయమే కాదన్నట్లు టెక్నాలజీ దిగ్గజాలు విశ్లేషిస్తున్నారు. సర్వసాధారణంగా మన దేశంలో ఎవరైనా ఏదైనా విషయాన్ని ఆన్లైన్లో తెలుసుకోవలంటే గూగుల్²ను ఆశ్రయించడం పరిపాటి.
ఆన్లైన్ సెర్చ్ అంశంలో మార్కెట్లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్ సంస్థ వివిధ అంశాల సెర్చ్ ఫలితాలను ప్రకటించే విషయంలో వాస్తవాలకు దూరంగా.. కొన్ని సంస్థలకు అధిక ప్రాధాన్యతనిచ్చే విధంగా ఫలితాలను అందించడం ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొంది.
ఇందుకు గాను ఆ సంస్థ 2013 నుంచి 2015 వరకు భారత్లోని కార్యకలాపాల ద్వారా గూగుల్ సంస్థ ఆర్జించిన సగటు మొత్తం ఆదాయంలో 5 శాతాన్ని జరిమానాగా విధించినట్టుగా సీసీఐ వెల్లడించింది.