రెండేళ్ల పాటు ప్రైస్ వాటర్ కూపర్పై ఆడిటింగ్ నిషేధం విధించిన సెబీ
అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కంప్యూటర్స్ ఖాతాలను ఈ సంస్థే ఆడిట్ చేసినా... కంపెనీ లాభనష్టాలకు సంబంధ
అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్కు (పీడబ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గట్టి షాకిచ్చింది. సత్యం కంప్యూటర్స్ ఖాతాలను ఈ సంస్థే ఆడిట్ చేసినా... కంపెనీ లాభనష్టాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వెల్లడికాలేదు. చివరకు ప్రమోటర్ రామలింగరాజు వెల్లడించాకే విషయాలన్నీ బయటికొచ్చాయి. సత్యం పెట్టుబడిదారులు భారీగా నష్టపోయిన ఈ వ్యవహారంలో... దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత పీడబ్ల్యూసీని సెబీ దోషిగా తేల్చింది. ఫలితంగా పీడబ్ల్యూసీ నెట్వర్క్ సంస్థలు రెండేళ్ల పాటు భారత్లోని లిస్టెడ్ కంపెనీలకు ఆడిట్ సర్టిఫికెట్లు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే సత్యం కంప్యూటర్స్ ఖాతాలు ఆడిటింగ్ ద్వారా పీడబ్ల్యూసీ, గతంలో దాని రెండు భాగస్వామ్య సంస్థలు అక్రమంగా ఆర్జించిన రూ.13 కోట్ల పైగా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని 108 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, పీడబ్ల్యూ నెట్వర్క్ సంస్థలు 2017-18కి సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఆడిటింగ్ అసైన్మెంట్స్పై దీని ప్రభావం ఉండదని తెలిపింది. సెబీ ఆదేశాలపై తాము స్టే తెచ్చుకుంటామని ప్రైస్ వాటర్హౌస్ కూపర్స్ ధీమా వ్యక్తం చేయగా, ఉత్తర్వులను పరిశీలించనున్నట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి చెప్పారు. ఆడిటర్లకు సంబంధించి ఇప్పటికే కఠిన నిబంధనలు ఉన్నాయని, వాటిని అమలు మాత్రమే చేయాల్సి ఉందని తెలిపారు.
భారతదేశ కార్పొరేట్ రంగాన్ని కుదిపేసిన రూ. 7,000 కోట్ల సత్యం కంప్యూటర్స్ కుంభకోణం 2009లో బయటపడింది. ఆ తర్వాత కంపెనీ చైర్మన్ రామలింగరాజు జైలుకెళ్లడం, సంస్థను టెక్ మహీంద్రా టేకోవర్ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవధిలో పీడబ్ల్యూసీ రెండు సార్లు రాజీ యత్నాలకు ప్రయత్నించినా విఫలమయింది. అయితే, అమెరికాలో మాత్రం రాజీ చేసుకోగలిగింది. బిగ్ ఫోర్గా పరిగణించే నాలుగు దిగ్గజ ఆడిటింగ్ కంపెనీల విషయంలో ఇంత తీవ్రమైన ఆదేశాలు జారీ కావడం దేశంలో ఇదే ప్రథమం.