చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గింపు
ఇప్పటికే అన్ని రకాల బ్యాంకు డిపాజిట్లపై కనీస వడ్డీ రేట్లు అమలవుతుండగా మరోమారు కేంద్రం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించింది.
ఇప్పటికే అన్ని రకాల బ్యాంకు డిపాజిట్లపై కనీస వడ్డీ రేట్లు అమలవుతుండగా మరోమారు కేంద్రం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించింది. దీంతో జాతీయ పొదుపు సర్టిఫికెట్లు(ఎన్ఎస్సీ), సుకన్య సమ్రుద్ధి ఖాతా, కిసాన్ వికాస్ పత్రాలు(కేవీపీ), పీపీఎఫ్..పథకాల్లో మదుపు చేసినవారిపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నది. వివిధ పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును 0.2% మేర తగ్గిస్తూ బుధవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. నూతన వడ్డీరేటు 2018 జనవరి-మార్చి త్రైమాసికం నుంచి అమలవుతుంది. సీనియర్ సిటిజన్స్ ఐదేళ్ల పొదుపు ఖాతాపై మాత్రం వడ్డీరేటును మార్చలేదు. వీరు చేసిన డిపాజిట్పై 8.3 శాతం వార్షిక వడ్డీని ప్రతీ మూడు నెలలకోమారు అందజేస్తున్నది.

పోస్టాఫీస్ పొదుపు ఖాతాకు సంబంధించి 4 శాతం వడ్డీ రేటులో ఎలాంటి మార్పూ లేదు. గతేడాది ఏప్రిల్ నుంచి ప్రతీ మూడు నెలలకోమారు పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తూ వస్తోంది. దీని ప్రకారం ప్రస్తుతం, పీపీఎఫ్, ఎన్ఎస్సీ పొదుపు పథకాలపై ఖాతాదారులు పొందుతున్న వడ్డీ రేటు 7.6 శాతం, కేవీపీపై 7.3 శాతానికి తగ్గిపోయింది. బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ధి పథకం కింద ఇప్పటిదాకా 8.3 శాతం వడ్డీ ఉండింది. ఇకపై 8.1 శాతం వడ్డీ మాత్రమే దక్కుతుంది. ఈ నిర్ణయం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ల వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేయనున్నది. త్వరలో బ్యాంకుల్లో వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గటం ఖాయం.


Click it and Unblock the Notifications