మూలధనం మాత్రమే సరిపోదు, మొండిబాకీలపై దృష్టి పెట్టాలి: వెంకటాచలం
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కేటాయిస్తేనే సరిపోదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటాచలం అన్నారు. మొండి బకాయిల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కేటాయిస్తేనే సరిపోదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటాచలం అన్నారు. మొండి బకాయిల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. మూలధనం ఆయా బ్యాంకులకు తాత్కాలిక ఉపశమనమేనని చెప్పుకొచ్చారు. వచ్చే రెండేళ్లలో బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్ల మూలధనం సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అహ్వానించాల్సిందేనని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అదనపు మూలధనం మరిన్ని రుణాలు ఇవ్వడానికి దోహదం చేస్తుందన్నారు. అయితే మొండి బాకీలకు పరిష్కారం కనుగొనకుండా ఇలాంటి చర్యలు తీసుకున్న పెద్ద ప్రతిఫలం ఉండదన్నారు. అన్ని బ్యాంకులు కూడా మొండి బాకీల గుదిబండతో ఒత్తిడిలో ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకు బ్యాంకుల మొండి బాకీలు రూ.8 లక్షల కోట్లకు చేరాయని పునరుద్గాటించారు. ఒకవేళ రుణాల పునరుద్దరణ మొత్తాలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం వసూల కాని రుణాల విలువ రూ.15 లక్షల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. మొత్తం ప్రస్తుతమున్న రూ.8లక్షల కోట్ల వసూలు కాని రుణాల్లో కేవలం 12 కంపెనీలకు సంబంధించినవే రూ.2.53 లక్షల కోట్ల వరకూ ఉన్నట్లు వెంకటాచలం వివరించారు. పెద్ద మొత్తంలో మొండి బాకీలు కార్పొరేట్, ఉద్దేశ్యపూర్వక ఎగవేతదార్లవేనని అన్నారు. మొండి బాకీల కోసం బ్యాంకులు అధిక కేటాయింపులు చేయాల్సి వస్తుందన్నారు. లాభాలన్నీ మొండి బాకీల కేటాయింపుల కోసమే అన్నట్లుగా ఉందన్నారు. అదనపు మూలధనం సమకూర్చడం తాత్కాలిక ఉపశమనం అయితే మొండి బాకీల వసూళ్లు బ్యాంకుల దీర్ఘకాల వాస్తవ పరిష్కారమన్నారు. మొండి బాకీల వసూళ్ల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా మొండి బాకీలను రద్దు చేయకూడదదని, వసూలు చేయాల్సి ఉందన్నారు. తమకు ఉపశమనం వద్దని, బ్యాంకులు కోలువాలని కోరుకుంటున్నామన్నారు.