బినామీ సమాచారం ఇస్తే రూ.1 కోటి నజరానా!
బినామీ ఆస్తులకు సంబంధించి సమాచారమై.. ఉప్పందించిన వారికి కనిష్టంగా రూ.15 లక్షల నుంచి గరిష్టంగా రూ. కోటి వరకు నజరానా అందించనున్నారు. ఈ విషయాన్ని సీబీడీటీ అధికారి ఒకరు తెలిపారు.
బినామీ ఆస్తుల వివరాలను వెలికి తీసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తెచ్చేందుకు ఆలోచిస్తోంది. భారీగా నగదు నజరానాను ప్రకటించడం ద్వారా బడా బాబులకు చెందిన బినామీ ఆస్తులకు సమాచారాన్ని రహస్యంగా సమీకరించాలని పత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటీ) భావిస్తోంది. వచ్చే నెలలో ప్రవేశ పెట్టనున్న ఈ పథకం కింద బినామీ ఆస్తులకు సంబంధించి సమాచారమై.. ఉప్పందించిన వారికి కనిష్టంగా రూ.15 లక్షల నుంచి గరిష్టంగా రూ. కోటి వరకు నజరానా అందించనున్నారు. ఈ విషయాన్ని సీబీడీటీ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుగు గుడ్రిటర్న్స్ పాఠకుల కోసం...
బినామీ చట్టంలో రివార్డుకు సంబంధించిన ప్రొవిజన్ లేదు
అక్రమాస్తుల సమాచారాన్ని అందించిన వ్యక్తి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచనున్నట్లు సదరు అధికారి తెలిపారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బినామీ ఆస్తుల చట్టంలో ఇందుకు సంబంధించిన ప్రొవిజన్ లేదు. బినామి ఆస్తులను గుర్తించడం వాటిని పన్ను పరిధిలోకి తేవడం.. ఆదాయపు పన్ను శాఖ వర్గాలకు కఠినతరంగా మారింది. ఈ నేపథ్యంలో సర్కారు ఈ నూతన పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా సమాచారం.
ప్రభుత్వ నజరానా ఎలా పొందాలి?
ఇన్ఫార్మర్ చెప్పిన సమాచారం కచ్చితమైనదై ఉండాలి. ఇన్ఫార్మర్కు ఇబ్బంది, ప్రమాదం వాటిల్లేలా సీబీడీటీ ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయదు. ఈడీ, ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇదివరకే ఈ తరహా రివార్డు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇది అంత ప్రోత్సాహకరంగా లేదు.
న్యూస్ ఏజెన్సీకి సీబీడీటీ అధికారి చెప్పిన విషయాలు
రహస్యంగా వ్యక్తులు అందించే సమాచారం ఆధారంగా వేగంగా, సమర్థవంతంగా ప్రభుత్వం విచారణలు,తమ ఆపరేషన్ పూర్తిచేయొచ్చు. దేశవ్యాప్తంగా బినామీ ఆస్తుల వివరాల వెలికితీతకు ఇన్ఫార్మర్లకు మంచి ప్రైజ్ మనీ ఇవ్వడం సీబీడీటీ పనిని మరింత సులభతరం చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి ప్రకటన అక్టోబర్ చివరన లేదా నవంబరు మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది.