ఎన్డీటీవీ అజయ్ సింగ్ సొంతం.. ఆయన గురించి ఆసక్తికర విషయాలు
ఎన్డీటీవీలో మెజారిటీ వాటా స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ సొంతం చేసుకోవడంతో ఈ రోజు షేర్పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో అజయ్ సింగ్ ఎవరు, ఈ డీల్ నేపథ్యం ఏమిటి అనే విషయాలను తెలుస
ఎన్డీటీవీగా అందరికీ తెలిసిన న్యూఢిల్లీ టెలివిజన్లో స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకులు అజయ్ సింగ్ మెజారిటీ వాటా కొనుగోలు చేశారని.. మీడియాలో వార్తలు రావడంతో.. మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంటు పెల్లుబికింది. ఒక్కసారిగా ఎన్డీటీవీ వాటాలను సొంతం చేసుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు మొగ్గుచూపడంతో ఈ సంస్థ షేర్లు ఉదయం ట్రేడింగ్లో 5శాతానికి పైగా లాభపడ్డాయి. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ లతో పాటు ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నడుస్తూ ఉండటంతో సంస్థ ఈక్విటీ గత కొద్దికాలంగా దిగజారుతూ వస్తోంది. అయితే మెజారిటీ వాటా స్పైస్ జెట్ సహ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్ సొంతం చేసుకోవడంతో ఈ రోజు ఎన్డీటీవీ షేర్పై ఆసక్తి పెరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ ఎక్స్ప్రెస్తో పాటు పలు మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే తమ సంస్థ యాజమాన్యంలో ఎలాంటి మార్పు జరగట్లేదని, ప్రమోటర్లు వాటా అమ్మేందుకు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని బీఎస్ఈకి ఇచ్చిన వివరణలో ఎన్డీటీవీ పేర్కొంది.ఈ నేపథ్యంలో అజయ్ సింగ్ ఎవరు, ఈ డీల్ నేపథ్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం.
1. స్పైస్ జెట్ విషయంలో
అజయ్ సింగ్ 2004లో స్పైస్జెట్ యాజమాన్యంలోకి ప్రవేశించాడు. అయితే 2010లో మీడియా దిగ్గజం, డీఎంకే నేత కలానిధి మారన్ స్పైస్జెట్లో మెజారిటీ వాటా దక్కించుకోవడంతో స్పైస్జెట్ యాజమాన్య హక్కులు మారన్కు బదిలీ చేయాల్సి వచ్చింది.
2. మారన్ నుంచి మళ్లీ అజయ్ సింగ్ చేతికి
అయితే కొన్నేళ్లకు సీన్ రివర్స్ అయింది. కంపెనీ ఆర్థిక స్థితి నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో మారన్ 2015లో సంస్థను నడిపే స్థితిలో లేకుండా పోయారు. అప్పుడు మళ్లీ మారన్ దగ్గరున్న ఎన్డీటీవీ మెజారిటీ వాటాలను అజయ్ సింగ్ కొన్నారు.
3. స్పైస్ జెట్ సీఎండీ పదవి
కంపెనీని పూర్వపు స్థితికి తెచ్చేందుకు స్పైస్ జెట్ బోర్డు అజయ్ సింగ్, ఆయన భార్య శివానీ సింగ్లను కంపెనీ డైరెక్టర్లుగా నియమించింది. అంతే కాకుండా కంపెనీ సీఎండీగా అజయ్ సింగ్ పదవి చేపట్టారు.
4. మోడీ ప్రచారం వెనుక
అయితే ఆసక్తికరంగా 2014లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నినాదం "Abki Baar Modi Sarkar" అనే దాని వెనుక ఉన్న వ్యక్తి అజయ్ సింగ్. దీనికి సంబంధించి అన్నీ తానై లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నడిపించారు.
5. వివిధ చోట్ల ఓఎస్డీగా
అంతే కాకుండా బీజేపీ కోర్ క్యాంపెయిన్ టీమ్లో సైతం సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్డీఏలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా పనిచేశారు. ఇంకా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, టెలికాం, ఐటీ శాఖల్లో ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. అంతే కాకుండా డీడీ స్పోర్ట్స్ చానల్ ప్రారంభించడంలో సాయపడ్డారు.
ఎన్డీటీవీ యాజమాన్య మార్పు లేదని బీఎస్ఈకి వివరణ
శుక్రవారం ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను స్పైస్ జెట్ అజయ్ సింగ్ దక్కించుకుంటారన్న వార్తలు రావడంతో స్టాక్ ఎక్స్చేంజీ బీఎస్ఈ ఆ సంస్థను వివరణ కోరింది. దీనికి సమాధానంగా తమ యాజమాన్యంలో ఎలాంటి మార్పులు జరగట్లేదని ఆ సంస్థ వివరణ ఇచ్చింది. 'ఎన్డీటీవీ ప్రమోటర్లు తమ వాటాను అమ్మేందుకు ఎవరితోనూ లేదా ఏ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకోలేద'ని చానల్ ఇచ్చిన స్టేట్మెంట్ తెలిపింది.