రూ.1,10,000 కోట్ల ఖర్చు: 3 గంటల్లో ప్రయాణం ఇదీ బుల్లెట్ రైలు కథ
దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు అహ్మదాబాద్-ముంబయి మధ్య నిర్మించేందుకు శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించిన పలు ముఖ్యాంశాలు ఇవే...
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ రోడ్లు అభివృద్ది కారకాలు అని అన్నారు. పూర్వం నదుల వెంట నాగరికత విలసిల్లినట్లుగా ఇప్పుడు రోడ్లు, రవాణా మార్గాల వెంట ప్రజలు నివసించడం పెరిగిందన్నారు. ఈ సందర్భంగా బుల్లెట్ ట్రైన్ సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం.
మొదటి అంతర్జాతీయ కొనుగోలుదారుగా భారత్
జపాన్ ప్రభుత్వం,ఆ దేశ రైలు కంపెనీలు ఎన్నో ఏళ్లుగా అమెరికాతో బుల్లెట్ రైల్ టెక్నాలజీని పంచుకునేందుకు లాబీయింగ్ చేశాయి. అయితే విజయం సాధించలేకపోయాయి. చివరగా భారత్ ముందడుగుతో జపాన్ ఒక అంతర్జాతీయ కొనుగోలుదారును చేజిక్కుంచుకుంది.
రైల్వే మంత్రి
సెప్టెంబరు 12న రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ " ఈ బుల్లెట్ రైలు రవాణా వ్యవస్థను సమూలంగా మారుస్తుందన్నారు. భారత్కు ఇది చరిత్రాత్మక క్షణంగా చెప్పుకొచ్చారు. భారత రవాణా వ్యవస్థలో సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చిన సందర్బం ఇదే అన్నారు. దీని వల్ల రవాణా వేగవంతమై రైతులకు సైతం సరుకు రవాణాకు ఉపయోగపడుతుందని, వ్యవసాయ ఉత్పత్తులను తగినంత వేగంగా తీసుకెళ్లవచ్చని" చెప్పారు.
ప్రాజెక్టు ఖర్చు
508 కి.మీ ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఖర్చు రూ.1,10,000 కోట్లు. ఇందులో జపాన్ ప్రభుత్వం 88వేల కోట్లను రుణం ఇస్తుంది. దానిపై 0.1% వడ్డీతో దీర్ఘకాలంలో రుణాన్ని తీర్చే విధంగా ఇరు దేశాల ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం రుణాన్ని జపాన్ ప్రభుత్వానికి 50 ఏళ్లలో తీర్చాలి. 15సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
మొత్తం 508 కి.మీ మార్గం ఇలా....
508 కి.మీ మార్గంలో 92 శాతం మార్గం దాదాపు ఎలివేటెడ్ అంటే భూమి పైన ఎత్తులో ఉంటుంది. 6% టన్నెల్(సొరంగం)లో, 2% భూమ్మీద వెళుతుంది. అంటే ఎలివేటెడ్ ట్రాక్ 468 కి.మీ. 27 కి.మీ సొరంగ మార్గంలో, 13 కి.మీ భూమి మీద నిర్మించడం జరుగుతుంది.
5. జపాన్ దేశమే ఎందుకంటే
ఈ రైలు ప్రాజెక్టు ఒప్పందాన్ని జపాన్తో ఎందుకు కుదుర్చుకున్నామంటే ప్రపంచంలోనే బుల్లెట్ రైలుకు జపాన్ పెట్టింది పేరు. ఇంతవరకూ జపాన్ బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్లో ఎటువంటి ప్రమాదాలు జరగనందు వల్లే జపాన్ దేశానికి ప్రాజెక్టు నిర్మాణ హక్కులు ఇచ్చినట్లు భారత రైల్వే మౌలిక సలహాదారు సుశాంత్ మిశ్రా ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీతో అన్నారు. సమయానుసారంగా రైళ్ల రాకపోకలు సాగించడం, అత్యాధునిక సాంకేతికతను జపాన్ ఉపయోగిస్తుందని మిశ్రా చెప్పారు.
6. ప్రాజెక్టు ఈ స్టేషన్లతో
శబర్మతి వద్ద టర్మినల్ పనులు సెప్టెంబరు 14 నుంచే మొదలవుతాయి. ప్రాజెక్టు కోసం మొత్తం 825 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని మిశ్రా అన్నారు. అహ్మదాబాద్-ముంబయి మార్గంలో ఉండే 12 స్టేషన్లు ముంబయి, థానే, విరార్, బొయసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరౌచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి మొదలైనవి ఉంటాయి.
7. తక్కువ ప్రయాణ సమయం
508 కి.మీ మొత్తం దూరాన్ని 2.7గంటల్లో ప్రయాణించవచ్చు. అహ్మదాబాద్, వడోదర, సూరత్,ముంబయి పట్టణాల్లో ఆగితే కేవలం 2గంటల 7 నిమిషాలు.ఎక్కువ స్టేషన్లలో ఆగినా దాదాపు 3 గంటల్లోపే మొత్తం ప్రయాణం పూర్తయ్యే అవకాశం ఉంది. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350కి.మీ కాగా, నిర్వహణ వేగం 320 కి.మీ ఉంటుంది. 12 స్టేషన్లలో కచ్చితంగా రైలు ఆగాలంటే బుల్లెట్ రైలు ప్రయాణ సమయం 2 గంటల 58 నిమిషాలు. మొత్తం అహ్మదాబాద్-ముంబై మధ్య 70 ట్రిప్పులు తిరిగే వీలుంది. 24 హైస్పీడ్ ట్రైన్లను జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగిలిన వాటిని మన దేశంలోనే తయారుచేస్తారని మిశ్రా వివరించారు.
8. ప్రాజెక్టు గురించి సంక్షిప్తంగా
అధికారికంగా 2023 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలనే లక్ష్యం
అయితే ఒక ఏడాది ముందుగానే దీన్ని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని భారత్ అంటోంది.
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1,10,000 కోట్లు(1.08 ట్రిలియన్ రూపాయలు)
350 కి.మీ వేగంతో వెళ్లేలా నిర్మించే ఈ ప్రాజెక్టులో రైలు గరిష్ట వేగం గంటకు 320కి.మీ
ఇప్పుడు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలుండగా అది 2 గంటలకు తగ్గును.
ఈ ప్రాజెక్టులో భాగంగా 7కి.మీ సొరంగం సముద్రం కింద నిర్మించాల్సి వస్తుంది.
ఉద్యోగాల కల్పన
ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు తయారీ రంగాన్ని ప్రోదుకొల్పుతుందని, ఉద్యోగ అవకాశాలు పెంచుతుందని మోదీ అన్నారు. 20 వేల నిర్మాణ రంగ ఉద్యోగాలు, ఇంకా 4వేల ప్రత్యక్ష ఉద్యోగాలు, నిర్వహణ కోసం 20వేల పరోక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. స్థానిక కంపెనీలైన ఎల్ అండ్ టీ, గామన్ ఇండియా లిమిటెడ్, జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సైతం పలు కాంట్రాక్టులను దక్కించుకుంటాయి.
సామర్థ్యం
ఒకసారి బుల్లెట్ రైలు ఒక వైపు నుంచి మరో వైపుకు వెళితే దాని వెనకాల ఉండే 10 కార్లు(బోగీలు) 750 మంది ప్రయాణికులకు తీసుకెళ్లగలవు. అంతే కాకుండా 16 కార్ల సాయంతో 1200 మందిని మోసుకెళ్లే వరకూ వీటిని మార్చవచ్చు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వార్షికంగా 1.6 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరవేరుస్తాయి. 2050 నాటికి రోజుకు 1.6 లక్షల మంది ప్రయాణిస్తారు.