జీఎస్టీ తర్వాత వ్యాపారులు పన్ను ఎలా ఎగవేస్తున్నారు?
ట్రేడర్ల అత్యాశ, జీఎస్టీలోని చిన్న చిన్న లోపాల పన్ను ఎలా ఎగవేయాలని కొంత మంది చూస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఏ విధంగా జీఎస్టీ పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. దేశ
ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాళ్లో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించి ప్రతిష్టాత్మకంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. జీఎస్టీ తర్వాత పారదర్శకత పెరుగుతుందని, అవినీతికి చెక్ పడుతుందని ఆ సందర్బంగా మోడీ అన్నారు. అయితే ట్రేడర్ల అత్యాశ, జీఎస్టీలోని చిన్న చిన్న లోపాల వల్ల వాస్తవంగా అలా జరగడం లేదు. పన్ను ఎలా ఎగవేయాలని కొంత మంది చూస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఏ విధంగా జీఎస్టీ పన్ను కట్టకుండా తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నారు. దేశంలో పరోక్ష పన్నులో పెద్ద సంస్కరణకు తూట్లు ఎలా పొడుస్తున్నారో చూద్దాం.
1.పాదరక్షలు, వస్త్రాల విషయంలో ఈ విధంగా జరుగుతోందా?
జీఎస్టీలో నాలుగు రకాల పన్ను రేట్లను విధించారు. 5,12,18,28 శాతం అని చెప్పి నాలుగు రకాల శ్లాబులు ఉన్నాయి. ఇంకా కొన్నింటిపై సున్నా జీఎస్టీ ఉంది. ఇదే వ్యాపారులకు కలిసొచ్చింది. పాదరక్షలపై రూ.500 కంటే తక్కువ ధర ఉంటే 5% జీఎస్టీ, అదే 500 ధర దాటితే 18% జీఎస్టీ. కాబట్టి పన్ను తప్పించుకునేందుకు కొంత మంది పాదరక్షలు నిర్వహించే దుకాణదార్లు ఒక్కో చెప్పు, బూటును ప్రత్యేకంగా అమ్ముతున్నారు. అదే విధంగా వస్త్రాల్లో సైతం రూ.1000 కంటే తక్కువ వాటికి 5% జీఎస్టీ, రూ.1000 కంటే ఎక్కువుంటే 12% జీఎస్టీ ఉంది. కాబట్టి వ్యాపారులు వస్త్రాలను సైతం ఒక్కోదాన్ని ప్రత్యేకంగా ఉంచి బిల్లు వేసి అమ్ముతున్నారు. ఉదాహరణకు కుర్తా, పైజామా కలిసి ఒక బిల్లు ఉన్నప్పుడు కుర్తా ప్రత్యేకంగా, పైజామా ప్రత్యేకంగా బిల్లు వేసి అమ్మితే వినియోగదారులకు తక్కువ ధరకే వస్తుంది. అదే విధంగా వ్యాపారి తక్కువ పన్ను కట్టొచ్చు.
2. బియ్యం, కొన్ని ఆహార పదార్థాలు
చీజ్, పనీర్, సహజమైన తేనె, గోదుమలు, బియ్యం, ఇతర తృణ ధాన్యాలు, పిండి వంటివి జీఎస్టీ పరిధిలోకి రావు. వీటిపై సున్నా జీఎస్టీ అమలవుతోంది. అయితే ఇవి బ్రాండెడ్, ప్యాకేజీ లేనివై ఉండాలి. అదే రిజిస్టర్ బ్రాండ్ అయితే మాత్రం 5% జీఎస్టీ వర్తిస్తుంది. దీన్నే వ్యాపారులు అనుకూలంగా మార్చుకున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో బ్రాండెడ్ బియ్యం బదులు లూజ్ బియ్యాన్నే అమ్ముతున్నారు.
3. బ్రాండెడ్ రైస్.. అవునా... కాదా?
దేశంలో ఎక్కువ అమ్ముడయ్యే రైస్ బ్రాండ్ ఇండియాగేట్. ట్రేడ్ మార్క్స్ చట్టం,1999 కింద రిజిస్టర్ కాలేదు కాబట్టి దీనికి ఇండియాగేట్ అనే రైస్ బ్రాండ్ పేరున్నా ఇది జీఎస్టీ నుంచి తప్పించుకునేందుకే చూస్తోంది. కేఆర్బీఎల్ లిమిటెడ్ అనే సంస్థకు ఇండియా గేట్, ఇండియా ఫార్మ్, లోటస్ అండ్ యూనిటీ అనే పేరిట సర్టిఫైడ్ బ్రాండ్లు ఉన్నాయి. అయితే వీటిలో దేన్నీ కూడా ట్రేడ్ మార్క్స్ చట్టం, 1999 ప్రకారం క్లాజ్ 30 కింద నమోదు చేయించలేదు. కాబట్టి ఈ బియ్యంపై జీఎస్టీ సున్నా శాతమే. జులై 3న అంతర్గత కమ్యూనికేషన్లో ఈ విధమైన సమాచారాన్ని ఆ సంస్థ పంపిందని లైవ్ మింట్ రిపోర్ట్ చేసింది.
4. ఎందుకిలా....
ప్రభుత్వం ఏకరీతి పన్ను అని చెప్పి మళ్లీ ఒకటి కంటే ఎక్కువ పన్ను శ్లాబులను విధించింది. కొన్ని పన్ను పరిధిలో లేకపోగా మరికొన్ని 5%, 12%, 18%, 28% ఇలా నాలుగు రకాల పన్ను రేట్లను నిర్ణయించారు. అదే విధంగా పన్నులను రాష్ట్రం, కేంద్రం మధ్య విభజించారు. జీఎస్టీలో ఉన్న చిన్న లొసుగులను అవకాశవాదంగా వాడుకుంటూ ఇదే ట్రెండ్ను కొనసాగిస్తే జీఎస్టీ మండలి మొత్తం పన్ను అమలు అవుతున్న తీరును పున:సమీక్షిస్తుందని ఒక ప్రభుత్వాధికారి వెల్లడించారు.