విలీనం తర్వాత శాఖల కుదింపు ఉండదు: ఎస్బీఐ చీఫ్
అనుబంధ బ్యాంకులను ఎస్బీఐలో విలీనం చేసిన తర్వాత బ్యాంకుల పనిప్రదేశాలను మార్చడమే కానీ బ్యాంకు శాఖల మూసివేత ఉండదని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య వెల్లడించారు. ఒక ప్రణాళిక ప్రకారమే విలీన ప్రక్రియ జరుగుతున్నదని, శాఖలను మూసివేయడం ద్వారా శాఖలను తెరిచేందుకు వచ్చిన అనుమతులను వృథా చేయబోమని ఆమె తెలిపారు. మెట్రో నగరాల్లో ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు ఒకే ప్రదేశంలో ఉండి ఉన్న సందర్భంలో ఏ శాఖలో ఎక్కువ వ్యాపారం జరుగుతుంటే దాన్ని అలాగే ఉంచి మరో దాన్ని ఇతర ప్రదేశాలకు మారుస్తామని ఆమె చెప్పారు.
ఎస్బీఐ 17 వేల బ్యాంకు శాఖలతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా ఉంది. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులైన స్టేట్బ్యాంక్ ఆప్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆప్ ట్రావెన్కోర్ అన్నింటికీ కలిపి మొత్తం 6000 పైగా శాఖలు ఉన్నాయి. మొత్తానికి వీటి విలీనం మార్చి, 2017 లోగా పూర్తయ్యేలా ఉంది.