For Daily Alerts
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్ : రూ. 2579 కోట్లకు
|
దేశీయ మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీ).. తమ స్పోర్ట్స్ చానెల్ టెన్ స్పోర్ట్స్ను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్కు అమ్మేసింది. మొత్తం నగదు లావాదేవీల్లో జరిగే ఈ ఒప్పందంలో భాగంగా జీకి సోనీ పిక్చర్స్ దాదాపు రూ. 2,579 కోట్ల (385 మిలియన్ డాలర్లు)ను చెల్లించనుంది. స్టాక్ ఎక్స్చేంజీకి జీ తెలిపిన వివరాల ప్రకారం సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ వ్యాపారాన్ని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పిఎన్)కు అమ్మేందుకు,బదలాయించేందుకు అంగీకారం తెలిపారు. 385 మిలియన్ డాలర్లకు అమ్మేశాం అని జీ వెల్లడించింది.
దేశంలో 10 అతిపెద్ద మీడియా సంస్థలు
తాజ్ టీవి లిమిటెడ్ మారిషస్ కింద తమ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ బిజినెస్ నడుస్తోందని, టెన్ బ్రాండ్ ఆఫ్ టెలివిజన్ చానెల్స్, తాజ్ టెలివిజన్ (ఇండియా) ద్వారా ప్రసారాలు జరుగుతున్నాయని జీ వివరించింది. దుబాయ్కి చెందిన అబ్దుల్ రెహ్మాన్ భుక్తియార్ నేతృత్వంలోని తాజ్ గ్రూప్ నుంచి 2006లో టెన్ స్పోర్ట్స్ను జీ నెట్వర్క్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. టెన్ బ్రాండ్లో టెన్ 1, టెన్ 1హెచ్డి, టెన్ 2, టెన్ 3, టెన్ గోల్ఫ్ హెచ్డి, టెన్ క్రికెట్, టెన్ స్పోర్ట్స్ చానెళ్లున్నాయి. భారత ఉప ఖండంతోపాటు మాల్దీవులు, సింగపూర్, హాంకాంగ్, మధ్య ప్రాచ్య, కరీబియన్ దేశాల్లో ఈ చానెళ్ల ప్రసారాలు జరుగుతున్నాయి. ఇక టెన్ స్పోర్ట్స్ నెట్వర్క్ కొనుగోలుతో దేశ, విదేశీ స్థాయిలలో ఎస్పిఎన్ మరింత బలపడుతుందని, ముఖ్యంగా క్రికెట్, ఫుట్బాల్, ఫైట్ స్పోర్ట్స్ ప్రేమికులకు దగ్గరవుతుందని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా సిఇఒ ఎన్పి సింగ్ అన్నారు. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో జీ ఏకీకృత ఆదాయంలో స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ బిజినెస్ వాటా 631 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయినప్పటికీ 37.20 కోట్ల రూపాయల నికర నష్టాన్ని చవిచూసింది. మరోవైపు తాజా లావాదేవీతో జీ షేర్ల విలువ దాదాపు 2 శాతం పెరిగింది.
Comments
English summary
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్ : రూ. 2579 కోట్లకు | Zee sells TEN Sports to Sony for 2579 crores
Story first published: Thursday, September 1, 2016, 17:03 [IST]