11 నగరాల్లో ఇళ్లకు గిరాకీ: నివేదిక
ప్రభుత్వం స్మార్ట్ నగరాలు, అమృత్ పథకాలతో ముందుకెళుతున్న క్రమంలో స్థిరాస్తి డిమాండ్ టైర్2,3 నగరాల్లో క్రమంగా పెరుగుతోంది. స్మార్ట్సిటీస్పై కుష్మన్ & వేక్ఫీల్డ్ రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిన్న నగరాలు, నాన్-మెట్రో నగరాల్లో ఇల్లు, ఇళ్ల స్థలాల గిరాకీ క్రమక్రమంగా పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. 2016-20 మధ్య కాలంలో ఇళ్ల కోసం 1 కోటి 20 లక్షల యూనిట్లు అవసరమని అధ్యయనంలో తేలింది. 11 నగరాల్లో వచ్చే ఐదేళ్లలో 9.44 లక్షల యూనిట్ల అవసరం ఉండొచ్చని అంచనా. సూరత్ అత్యధిక డిమాండ్ కలిగి ఉండగా విశాఖ పట్నం లక్ష యూనిట్ల అవసరాలతో జాబితాలో చోటుదక్కించుకుంది. ఇక్కడ యూనిట్లను, ఇళ్లను ఒకే అర్థంలో తీసుకోవాలి.
1. సూరత్:
2001 నుంచి 10 సంవత్సరాల్లో ఈ నగర జనాభా రెండింతలయింది. ఈ నగరంలో వచ్చే ఐదేళ్లలో 2.3 లక్షల ఇళ్లు అవసరం ఉంటుందని అంచనా.
2. కొచ్చి:
కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో 1.18 లక్షల ఇళ్ల అవసరం ఉంటుంది. పోర్టు ఉండటం ఈ నగరానికి బాగా కలిసొచ్చింది. ఎర్నాకుళం జిల్లాలో అతిపెద్ద నగరమిది. ఈ నగర జనాభా ఇటీవలి లెక్కల ప్రకారం 31 లక్షలపైనే ఉంది.
3. విశాఖ పట్నం
ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నగరమైన విశాఖలో 1 లక్ష ఇళ్ల అవసరం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖ పట్నం జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. విశాఖ పట్నానికి ప్రధానమైన అనుకూలత అన్ని రకాల రవాణా మార్గాలతో అనుసంధానమై ఉండటం. అంతర్జాతీయ విమానశ్రయం కలిగి ఉండటంతో పాటు భారత నౌకదళ తూర్పు కమాండుకు విశాఖ పట్నం కేంద్ర స్థానంగా ఉంది.
4. లక్నో
ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నో, దిల్లీ, కలకత్తా తర్వాత ఉత్తర భారత్లో మూడో అతిపెద్ద నగరం. ఈ మెట్రో నగర జనాభా 29లక్షల 2 వేల 920. జీడీపీ పరంగా దేశంలో 15 అతిపెద్ద నగరాల్లో లక్నో ఉంది.
ఈ నగరానికి 89,600 ఇళ్ల అవసరం ఉంది.
5.జైపూర్
రాజస్థాన్లో ప్రముఖ పట్టణమైన జైపూర్లో 81,700ఇళ్ల అవసరం ఉంది. 484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నగరంలో 30 లక్షలకు పైగా జనాభా ఉంది.
6.నాగ్పూర్
మహారాష్ట్రలో మూడో అతిపెద్ద నగరమైన నాగ్పూర్ ఆ రాష్ట్రానికి శీతాకాల రాజధానిగా ఉంటోంది. దేశంలో జనాభా పరంగా 13వ స్థానంలో ఉంది. ఈ నగరానికి 80 వేల ఇళ్ల అవసరం ఉంది.
7.ఇండోర్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి 78,100 యూనిట్ల అవసరం ఉన్నట్లు అంచనా. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం అత్యధిక జనాభా కలిగిన నగరమిది. వస్తు,సేవలకు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఇండోర్ ఉంటోంది.
8.కోయంబత్తూర్
తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోయంబత్తూర్ నగరంలో సమీప భవిష్యత్తులో 76,000 ఇళ్ల అవసరం ఉంటుందనుకుంటున్నారు. కోయంబత్తూర్ దక్షిణ భారత మాంచెస్టర్గా పేరుగాంచింది.
9.వడోదర
వడోదర నగరంలో 36,600 ఇళ్ల అవసరం ఉందని అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం 20 లక్షలకు పైగా ఉంది. జనాభా పరంగా అహ్మదాబాద్, సూరత్ తర్వాత గుజరాత్లో మూడో అతిపెద్ద నగరమిది.
10. చండీఘడ్
కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘడ్లొ 33,100 ఇళ్ల అవసరం ఉంది.
11. భువనేశ్వర్
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ గన జనాభా(2011) 8.81 లక్షలకు దగ్గరగా ఉంది. ఈ నగరంలో 21,600 ఇళ్ల అవసరం ఉన్నట్లు అంచనా.