లాభం ఎవరికి?: వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన సమీక్ష వివరాలను సోమవారం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడించారు. మార్కెట్ వర్గాలు ఊహించినట్టుగానే రెపో రేటు (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటు)ను పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వడ్డీ రేట్లను తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని, రివర్స్ రెపో రేటును పావుశాతం తగ్గించినట్లు వివరించారు. దీంతో 6.75 శాతంగా ఉన్న రెపో రేటు 6.50 శాతానికి తగ్గింది.
కాగా, రివర్స్ రెపో రేటు (ఆర్బీఐ వద్ద బ్యాంకులు దాచుకునే నిధులపై పొందే వడ్డీ)ను సైతం 5.75 శాతం నుంచి 5.50 శాతానికి తగ్గించారు. ఇదే విధంగా సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో - నగదు నిల్వల నిష్పత్తి) యథాతథంగా ఉంచుతున్నామని తెలిపారు.
ఎంఎస్ఎఫ్ రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేయగా, సీఆర్ఆర్ రోజువారీ కనీస నిర్వహణను 95 శాతం నుంచి 90 శాతానికి తగ్గించినట్లు రాజన్ వెల్లడించారు.
రెపోరేటు 0.25 శాతం కోతతో హోం, వాహన రుణాలు తీసుకున్న వారికి మరోసారి వడ్డీ రేటు తగ్గేందుకు మార్గం సుగమమైంది. చిల్లర ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతంలోపు ఉండటం, వడ్డీ రేట్లను తగ్గించేందుకు సహకరించిందని ఈ సందర్భంగా రాజన్ వ్యాఖ్యానించారు.
ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో స్టాక్ మార్కెట్ల ఒక్కసారిగా కుదేలయ్యాయి.