భారీ పతనం: మ్యాగీ నూడుల్స్తో 9 ఏళ్ల కనిష్టానికి నెస్లే షేర్లు
ముంబై: బుధవారం షేర్ మార్కెట్లో నెస్లే ఇండియా లిమిటెడ్ షేర్లు భారీగ పతనమయ్యాయి. దేశ వ్యాప్తంగా మ్యాగీ వివాదం నడుస్తుండటంతో నెస్లే షేర్లు పది శాతం తగ్గాయి. ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్లో అధిక మొత్తంలో రసాయనాలు ఉన్నాయని, మ్యాగీ నూడుల్స్ తినడం సురక్షితం కాదని ప్రకటించిన నేపథ్యంలో నెస్లే షేర్లు తొమ్మిదేళ్ల కాలంలో అతి తక్కువ పతనాన్ని చూశాయి.
బాంబే స్టాక్ ఎక్సేంజ్లో 9.05 శాతం తగ్గి షేరు విలువ రూ. 6191 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో 9.06 శాతం తగ్గి రూ. 6186 వద్ద ముగిసింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నెస్లేకు చెందిన మ్యాగీ నూడుల్స్ను పరీక్షల కోసం లేబరేటరీలకు పంపించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే, దేశ వ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్పై ఆరోపణలు రావడంతో పలు రాష్ట్రాల్లో వాటిని నిషేధించారు. కేరళలో మ్యాగీ నూడుల్స్ నిషేధించారు. ఢిల్లీలో మ్యాగీ నూడుల్స్పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణలోనూ మ్యాగీ శాంపుళ్లపై హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో పరీక్షలు చేయిస్తోంది.
ఢిల్లీలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం
దేశ రాజధాని ఢిల్లీలో మ్యాగీ నూడిల్స్ అమ్మకాలపై నిషేధం విధించారు. మ్యాగీపై 15 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్ ఫుడ్ డిపార్ట్మెంట్ బుధవారం సమావేశమై మ్యాగీ నూడుల్స్ వ్యవహారంపై చర్చించనుంది. మ్యాగీ నూడుల్స్పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకోనుంది.
కర్ణాటకలోనూ ప్రభుత్వం ఇదే తరహా పరీక్షలకు సిద్ధమవుతోంది. హర్యానాలోనూ బీజేపీ ప్రభుత్వం మ్యాగీ నూడుల్స్ శాంపుళ్లను రాష్ట్ర వ్యాప్తంగా సేకరిస్తోంది. సేకరించిన శ్యాంపుల్స్ను ల్యాబ్లకు పాంపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్టు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు.