ఇంటర్ బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను తగ్గించిన ఎన్పీసీఐ
ఇంటర్ బ్యాంకు ఏటీఎం నెట్వర్క్ లావాదేవీల చార్జీలను 10 శాతం మేర (5 పైసలు) తగ్గిస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంకు ఆధీనంలో పని చేసే ఈ నేషనల్ ఫైనాన్స్ స్విచ్(ఎన్ఎఫ్సీ) సంస్ధ లావాదేవీల నిర్వహణ పెరగడం, నెట్వర్క్ పనితీరు మరింతగా మెరగవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఎన్ఎఫ్సీ సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎపీ హోతా మాట్లాడుతూ కార్యనిర్వాహక సామర్ధ్యం తీసుకురావడానికి ద్వారా నిరంతర ప్రాతిపదికన లావాదేవీ ఫీజు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీంతో పాటు 45 పైసలకు తగ్గించటమే కాక, లావాదేవీలు పెరగటానికి మరింత తగ్గింపు చేపడతామని చెప్పారు.
ప్రస్తుతం 400 బ్యాంకులకు చెందిన 1.92 లక్షల ఏటీఎంలకు కేంద్రీయ పేమెంట్ గేట్వేగా ఉన్న ఈ నేషనల్ ఫైనాన్స్ స్విచ్(ఎన్ఎఫ్సీ) సంస్థ ప్రస్తుతం ప్రతి లావాదేవీకి 50 పైసలు వసూలు చేస్తోంది. తగ్గించిన చార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయన తెలిపారు.
ఖాతా ఉన్న బ్యాంకు కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలను వినియోగించే వారి నుంచి లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జోక్యం చేసుకుని ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
తాజా నిబంధనలతో ఇతర ఏటీఎంలలో ఐదు లావాదేవీల వరకు ఉచితం. అంతకు మించేతే ఛార్జీలు వసూలు చేస్తారు.