ఆంధ్రాబ్యాంకు Q4 ఫలితాలు: లాభం డబుల్(ఫోటోలు)
హైదరాబాద్: ఆంధ్రా బ్యాంకు మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసిక, వార్షిక ఫలితాలను బ్యాంకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సివి. రాజేంద్రన్ సోమవారం ప్రకటించారు. డిపాజిట్ల వ్యయం తగ్గడం, రుణాలపై ప్రతిఫలం పెరగడంతో అత్యుత్తమ పనితీరుని ప్రదర్శించామన్నారు.
మార్చితో ముగిసిన మూడు నెలలకు బ్యాంకు రూ. 185 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 88 కోట్ల కంటే ఇది 110.2 శాతం అధికమని తెలిపారు. మొత్తం ఆదాయం 15.8 శాతం వృద్ధితో రూ. 4,058 కోట్ల నుంచి రూ. 4,699 కోట్లకు చేరిందన్నారు.
గతేడాది అదే కాలంలో బ్యాంకు 17,868.45 కోట్ల రూపాయల ఆదాయంపై 638.44 కోట్ల రూపాయల నికరలాభం ఆర్జించిందన్నారు. గత ఏడాది ఆర్జించిన 15,630 కోట్ల రూపాయలతో పోల్చితే ఆదాయం 14.3 శాతం పెరిగిందని, నికరలాభం 46.3 శాతం పెరిగి 436 కోట్ల నుంచి 638 కోట్ల రూపాయలకు చేరిందని తెలిపారు.
ఆంధ్రాబ్యాంకు Q4 ఫలితాలు
మార్చి 31 నాటికి స్థూల ఎన్పిఎలు వార్షికంగా 5.29 శాతం నుంచి 5.31 శాతానికి పెరిగినా నికర ఎన్పిఎలు 3.11 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గాయని ఆయన చెప్పారు. పరిస్థితులు కొంత ప్రతికూలంగానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తాము అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన త్రైమాసికం ఇదేనని అన్నారు. రుణాలపై రాబడి 6.7 శాతం పెరిగి డిపాజిట్ వ్యయాలు 3.3 శాతానికి తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్ పెరిగి లాభాల్లో సాధ్యమయిందని ఆయన తెలిపారు.
ఆంధ్రాబ్యాంకు Q4 ఫలితాలు
దీనికి తోడు ఎన్పిఎలుగా మారిన రుణాల వసూలు గత ఏడాదితో పోల్చితే 689 కోట్ల రూపాయల నుంచి 2405 కోట్ల రూపాయలకు పెరగడం కూడా బ్యాంకుపై భారం తగ్గడానికి దోహదపడిందని ఆయన అన్నారు. మొత్తం మీద గత ఏడాది 13,982.22 కోట్ల రూపాయల విలువ గల రుణాలను పునర్వ్యవస్థీకరించామని ఆయన చెప్పారు. ఏడాది మొత్తం మీద వెయ్యి కోట్ల రూపాయలు కొత్త ఎన్పిఏలుగా నమోదయ్యాయని తెలిపారు.
ఆంధ్రాబ్యాంకు Q4 ఫలితాలు
వచ్చే మూడేళ్లలో ఆంధ్రా బ్యాంకు వెయ్యికి పైగా శాఖలను ఏర్పాటు చేయనుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 300 కొత్త శాఖలు ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్యాంకుకు మొత్తం 2,507 శాఖలు, 2,232 ఏటీఎంలు ఉన్నాయని అన్నారు.
ఆంధ్రాబ్యాంకు Q4 ఫలితాలు
తెలుగు రాష్ర్టాల్లో కొత్త బ్రాంచిల ఏర్పాటులో తెలంగాణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 850 శాఖలుండగా తెలంగాణలో 500 శాఖలు మాత్రమే ఉన్నాయని, అందుకే ఇక్కడ అధిక శాఖలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో తక్కువ శాఖలున్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, కడప జిల్లాలకు కొత్త శాఖల ఏర్పాటులో ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.