టీసీఎస్పై Q4 ఫలితాల ప్రభావం: 3నెలల కాలంలో అతిపెద్ద పతనం
దేశీయ అతిపెద్ద సాప్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) Q4 ఫలితాల ప్రభావం శుక్రవారం షేర్లపై పడింది. ఐటీ కంపెనీలు, ఈక్విటీలు నష్టపోయాయి. టీసీఎస్తో సహా మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్, ఇన్పోసిస్ తదితర కంపెనీల వాటా విలువ 1 శాతం నుంచి 5 శాతం మేర నష్టపోయాయి.
శుక్రవారం మధ్యాహ్నాం 2:50 గంటల సమయంలో సీఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. మైండ్ ట్రీ 5 శాతానికి పైగా పడిపోయింది. ఇక గురువారం ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ ఈక్విటీ ఏకంగా 4 శాతం నష్టపోయింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి టీసీఎస్ కంపెనీ షేర్ బాంబే స్టాక్ ఎక్సేంజ్లో 109 పాయింట్లను కోల్పోయి 2476 వద్ద ట్రేడ్ అయింది.
దేశీయ అతిపెద్ద సాప్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికం (Q4)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ. 3,713 కోట్లుగా ప్రకటించింది. గత ఏడాది ఈ కాలంలో రూ. 5,358 కోట్లతో పోలిస్తే లాభంలో 30.6 శాతం తగ్గింది.
అయితే ఉద్యోగులకు ప్రకటించిన వన్ టైమ్ బోనస్ రూ. 2,628 కోట్లను కలుపుకుంటే Q4లో నికరలాభం రూ. 5,773 కోట్లుగా నమోదైందని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత ఏడాదిలో ఇదే త్రైమాసికంతో పోల్చితే 7.7 శాతం అధికం. ఇక సమీక్షా త్రైమాసికానికి కంపెనీ ప్రకటించిన రాబడి 24,219.8 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో (21,551.1) పోల్చితే రాబడిలో 12.4 శాతం వృద్ధి నెలకొంది.
ఇక మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ మొత్తం రాబడి 15.7 శాతం వృద్ధి చెంది 94,648 కోట్ల రూపాయలకు చేరుకుంది. నికర లాభం 13.5 శాతం పెరిగి 19,648 కోట్ల రూపాయలకు ఎగబాకింది.
2015-16 సంవత్సరానికి గాను 60,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్టు కంపెనీ హెచ్ఆర్ హెడ్ అజయ్ ముఖర్జీ తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో 14,395 మందిని (నికరంగా 1,031 మంది) ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
ట్రెయినీలను మినహాయిస్తే ఉద్యోగుల వినియోగస్థాయి 85.4 శాతంగా ఉందని అన్నారు. ఇది ఇలా ఉంటే గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ఆర్ధిక ఫలితాలను ప్రకటించిన తర్వాతే మిగతా కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించేవి. కానీ ఈసారి అందుగు భిన్నంగా ఉంది.