బడ్జెట్ రోజున మ్యూచువల్ ఫండ్లను అమ్మలేరు, కొనలేరు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 28(శనివారం) ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అయితే స్టాక్ మార్కెట్లు బడ్జెట్ రోజున పనిచేస్తున్నాయి. కానీ ఆ రోజున మ్యూచువల్ ఫండ్లను మదుపర్లు కొనలేరు, అమ్మలేరని తెలుస్తోంది.
'శనివారం మ్యూచువల్ ఫండ్ల కార్యకలాపాలు జరగవు. ఈ రోజున మదుపర్లు మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తులను కొనలేరు, అమ్మలేరు' అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్లకు సాధారణంగా శని, ఆది వారాలు సెలవు రోజులు.
ఆయా రోజుల్లో ఫండ్ సంస్ధలు తమ డెట్, ఈక్విటీ ఫండ్లకు నికర ఆస్తి విలువను కేటాయించవు. తదుపరి పనిచేసే రోజునే కేటాయింపులు జరుగుతాయనే విషయం అందిరికీ తెలిసిందే. ఈ ఏడాది బడ్జెట్ను శనివారం ప్రవెశపెడుతుండటంతో ట్రేడింగ్ జరపాలని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ కోరింది.