పోటీతత్వాన్ని పెంచుకోండి: పిఎస్బిలకు రాజన్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ(పిఎస్యు) బ్యాంకులు ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడడం ద్వారా పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలుగా తమ స్వభావాన్ని విస్మరించకుండానే అవి పోటీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టయితే మార్కెట్ల నుంచి నిధుల సమీకరణ తేలికవుతుందని ఆయన పేర్కొన్నారు. రఘురాం రాజన్ సోమవారం జరిగిన కాంపిటీషన్ కమిషన్ (సిసిఐ) వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.
పోటీతో సామర్థ్యాలు ఇనుమడిస్తాయని, మంచి పని తీరు ప్రదర్శించే వారికి నిధుల సమీకరణ తేలికవుతుందని చెప్పారు. భారత్తో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో అద్భుతంగా పని చేస్తున్న పిఎస్యు బ్యాంకులున్నాయంటూ, వాటి పోటీ సామర్థ్యం పెరగడానికి ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం కాదని ఆయన తెలిపారు. పిజె నాయక్ కమిటీ సూచించిన విధంగా పిఎస్యు బ్యాంకులు నిర్వహణా సామర్థ్యాలు మెరుగుపరుచుకోవడం తప్పనిసరి అని రఘురాం రాజన్ అన్నారు.
పిఎస్యు బ్యాంకుల సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు హోల్డింగ్ కంపెనీల ఏర్పాటు, సిఈఓల పదవీకాలం పొడిగింపు, చైర్మన్, సిఈఓ పాత్రలు వేరు చేయడం వంటి ఎన్నో సూచనలు అందాయని, వాటన్నింటినీ నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని రాజన్ తెలిపారు. పిఎస్బిలు తమ వద్ద పని చేస్తున్న నిపుణులను ఉద్యోగాల్లో కొనసాగించేందుకు కృషి చేయడంతో పాటు ఇతర బ్యాంకుల్లో పని చేస్తున్న నిపుణులను కూడా ఆకర్షించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు.
సిబ్బందికి బాధ్యతలతో పాటు నిర్వహణాపరమైన స్వేచ్ఛ ఇవ్వడం ఇందుకు ప్రధానమని రాజన్ తెలిపారు. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను మరింత విస్తరించే క్రమంలో బిజినెస్ కరెస్పాండెంట్లకు మరింత సడలింపులు ప్రకటించనున్నట్టు రాజన్ చెప్పారు. పేమెంట్ బ్యాంకులుగా పరివర్తన చెందిన కొన్ని సంస్థలు మారుమూల ప్రాంతాల్లో వాణిజ్య బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా నిలవగల సామర్థ్యం కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.